Banjara Hills Land Issue : సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూ వివాదంలో పోలీసులకు కోర్టు మెమోలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని కోర్టు తెలిపింది. బంజారాహిల్స్ లో రూ. వంద కోట్ల విలువైన భూమి కబ్జా కేసులో అందరికీ బెయిల్ ఇచ్చింది కోర్టు. ఈ స్థలం అసలు యజమాని వి.వి.ఎస్. శర్మకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పోలీసులు ఏ3గా పేర్కొన్న సుభాష్ పులిశెట్టి డ్రైవర్ ని అక్రమంగా పోలీసులు నిర్బంధించడంపై కోర్టు సీరియస్ అయింది. దాదాపు పది రోజుల పాటు అతని అరెస్టుని పోలీసులు చూపించకపోవడంతో హెబియస్ కార్పస్ ద్వారా కోర్టు దృష్టికి బాధితులు  తీసుకెళ్లారు. అక్రమంగా నిర్బంధించడంపై న్యాయస్థానం సీరియస్ అయింది. సంబంధిత పోలీసు అధికారులకు మెమో జారీ చేసింది. బెయిల్ షరతుల మేరకు అడ్వకేట్ మిధున్ కుమార్ తదితరులు ఆదివారం బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేశారు. 


అసలు ఏం జరిగింది? 


మొదటి నుంచి బంజారాహిల్స్ భూవివాదంలో కబ్జా చేసిన వారిని వదిలేసి బాధితుల్ని దోషులు చేస్తున్నారని అరెస్టైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఏపీ జెమ్స్ పార్క్ స్థలం హద్దులు మార్చి వివాదం సృష్టించారని వివరణ ఇస్తున్నారు. హైదరాబాద్ దోమల్ గూడకు చెందిన డాక్టర్ వీవీఎస్ శర్మ ఈ స్థలానికి అసలు హక్కుదారు. ఆయన తండ్రి ప్రముఖ ఇంజనీర్ వి.డి. ప్రసాదరావు హయాంలో ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. వి.డి. ప్రసాదరావు హైదరాబాద్ లోని గగన్ మహల్, ఏఎస్ రావు నగర్ వంటి అనేక ప్రముఖ లేఅవుట్లు, నిర్మాణాలకు ఇంజనీర్ గా పనిచేశారు. సత్యసాయిబాబా ట్రస్టుకి వ్యవస్థాపక సభ్యులు. 2,248 చదరపు గజాల స్థలానికి పక్కనే ఉన్న రెండు ఎకరాల 05 కుంటల స్థలాన్ని 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెమ్స్ అండ్ జెవెల్స్ పార్క్ ప్రైవేటు లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థకి కేటాయించింది. అప్పటి నుంచి డాక్టర్ వి.వి.ఎస్ శర్మ స్థలానికి కూడా కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని అనుమతులతో నిర్మించి దశాబ్దాలుగా ఈ స్థలానికి రక్షణగా ఉన్న ప్రహరీ గోడని కూలగొట్టి కలిపేసుకునే ప్రయత్నం చేశారు. ఈ కూల్చివేతని రెవిన్యూ అధికారులు నిర్ధారించి జాయింట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఇచ్చినా జెమ్స్ పార్క్ సంస్థ తీరు మారలేదు. దీంతో కోర్టులో కేసు వేశారు బాధితులు. 


దివాలా తీసిన జెమ్స్ పార్క్ కంపెనీ 


జెమ్స్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2016లో దివాలా తీసింది. 6 వేల కోట్లకు పైగా బ్యాంకు రుణాలు తీసుకున్న ఈ సంస్థ నిర్వాహకులు దేశం విడిచి పరారయ్యారు. దీంతో ఈ సంస్థ ఆస్తుల్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. దివాలా ప్రక్రియ ద్వారా ఈ స్థలాన్ని కారుచౌకగా కొట్టేయాలని చూస్తున్న మరొక ప్రైవేటు సంస్థ కోర్టు వివాదాన్ని అడ్డం పెట్టుకొని వి.వి.ఎస్. శర్మ స్థలాన్ని కూడా కబ్జా చేయాలని ప్రయత్నించింది. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శర్మ పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ని పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టుని ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ పొందారు. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత న్యాయవాది సమక్షంలో స్థల యజమాని ప్రతినిధులు, ల్యాండ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ ప్రతినిధులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని స్థలాన్ని సందర్శించారు. షూటింగ్ పర్పస్ కోసం దాదాపు రెండు గంటలు అక్కడే స్థల పరిశీలన జరిపారు. ఈ క్రమంలో పోలీసులతో సంప్రదింపులు కూడా చేశారు. అయితే అనూహ్యంగా వారందరిని పోలీసులు నిర్బంధించారు. పైగా ఘర్షణలకు దిగారని, విధ్వంసం సృష్టించినట్టు కేసులు నమోదు చేశారు. రాయలసీమ రౌడీలు, గూండాలు అంటూ రాజకీయ రంగు పులిమారు.