Hyderabad Accident: నూతన సంవత్సరం ప్రారంభం రోజే హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ మూడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న టీఎస్ 07 ఎక్స్ 5195 నంబర్ గల కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న డివైడర్ ను ఢీకొట్టి అదుపు తప్పింది. వెంటనే మరో రెండు కార్లను కూడా ఢీకొట్టింది. ఇదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీకొట్టగా.. వారు గాల్లోకి ఎగిరి పడ్డారు. కింద పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణం అయిన మణిపాల్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మద్యం తాగి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు పెయింటింగ్ పని చేసుకుంటూ బ్రతికే శ్రీనివాస్,ఈశ్వరి లుగా పోలీసులు గుర్తించారు. 


గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాయల్ టిఫిన్ సెంటర్ ఎదురుగా 25 మంది వరకు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా రోడ్డు లోతుగా ఉండడం కూడా ప్రమాదాలకు కారణం అని పోలీసులు భావిస్తున్నారు. కొత్తగా ఇటువైపు వచ్చే వారికి ఈ రోడ్డులో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు. కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా లేకపోవడం ప్రమాదాలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. కారు ఢీకొట్టడంతో హోటల్ ఫ్లెక్సీలు ఊడి పడిపోయాయి.


నిన్నటికి నిన్న మహబూబాబాద్ లో ప్రమాదం - నలుగురు దుర్మరణం


మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలో గ్రానైట్ బండరాయి పడి నలుగురు కూలీలు మృతి చెందారు. లారీలో తరలిస్తున్న గ్రానైడ్ రాయి  ఆటోపై పడి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కురవి మండలంలోని అయ్యగారి పల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు చిన్న గూడూరు మండలంలోని జయ్యారం వాసులుగా గుర్తించారు. కూలి పనుల కోసం వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 10 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


అసలేం జరిగింది?


మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కురవి వద్ద జాతీయ రహదారిపై ఆటోపై గ్రానైట్‌ లారీపై నుంచి బండరాళ్లపడిపోయాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ సహాయం బండరాళ్లను రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. మృతులను మంగోరిగూడెంకు చెందిన వారుగా గుర్తించారు. లారీ గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తుండగా.. వాటికి కట్టిన తాళ్లు ఊడిపోయాయి. పక్క నుంచి వెళ్తోన్న ఆటోపై బండరాళ్లు పడిపోయాయని స్థానికులు చెబుతున్నారు. భారీ బండరాళ్లు కావడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువురికి కాళ్లు, చేతులు విరిగాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మితిమీరిన వేగం, సరిగా రాళ్లను కట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. లారీ మహబూబాబాద్‌ నుంచి మరిపెడకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌ సహాయంతో బండరాళ్లను తొలగించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడ్డ నలుగురికి మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.