పోలీసులంటే ఓ భద్రత భరోసా. ఇది పోలీసు డిపార్ట్ మెంట్ స్లోగన్ ( AP Police ) .  కానీ సామాన్యులకు మాత్రం పోలీసులను చూస్తే ఓ రకమైన టెర్రర్. తప్పు చేయని వాళ్లకే ఈ టెర్రర్. నిజానికి దొంగతనాలకు అలవాటు పడిపోయిన వాళ్లకు ఈ పోలీసులను అసలు పట్టించుకోరు. పోలీసుల ఇళ్లలోనే దొంగతనాలు జరిగిన ఘటనలు చూశాం. ఇప్పుడు అలాంటిదే ఒకటి గుంటూరు జిల్లా గురజాలలో ( Gurajala ) చోటు చేసుకుంది. గురజాలలో డీఎస్పీ ఆఫీసు ( DSP Office ) ఉన్న ప్రాంతం అంటే ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. హెల్మెట్లు లేకుండా లేకపోతే లైసెన్సులు లేకుండా ఎవరూ అటువైపు కూడా పోరు. 


కానీ అలాంటి చోట చేతివాటం అలవాటయిన దొంగలు మాత్రం అలవోకగా లూటీలు చేసేస్తున్నారు. గురజాల డీఎస్పీ ఆఫీసు ఎదురుగా కొన్ని దుకాణాలు ఉన్నాయి. వాటిలో సెల్ ఫోన్ షాపు (Cell Phone Shop ) ఒకటి. ఆ దుకాణం యజమాని యధావిధిగా వ్యాపారం ముగించుకుని ఇంటికెళ్లాడు. మళ్లీ పొద్దున దుకాణం తెరిచి చూస్తే దుకాణం ఖాళీగా ఉంది. పై నుంచి ఎండ లోపలికి వస్తూ కనిపించింది. ఏమిటా అని తలపైకెత్తి చూస్తే అక్కడ పెద్ద బొక్క ఉంది. తన దుకాణంపై కప్పుకు పెద్ద బొక్క పెట్టి అందులోనుంచి దిగి తన సొత్తు అంతా దోచుకెళ్లాడని రెండు నిమిషాలకే ఆ యజమానికి స్ట్రైక్ అయింది. 


అంతే లబోదిబోమంటూ ఎదురుగా ఉన్న డీఎస్పీ ఆఫీసుకు పరుగెత్తుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఎంతయినా అది పోలీసుల ఇజ్జత్‌కు సంబంధించిన విషయం. తమ కార్యాలయం ఎదుటే  దుకాణానికి కన్నం వేసి మరీ దోచుకెళ్లిపోయాడంటే అది వారికి అవమానమే. ఇంకా ఇందులో ట్విస్టేమిటంటే దొంగతనం జరిగిన రోజు పగటి పాటు డీఐజీ త్రివిక్రమ్, ఎస్పీ విశాల్ గున్నీ గురజాల డీఎస్పీ ఆఫీస్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు సరిగ్గా ఉన్నాయా.. పోలీసులు భద్రత అందరికీ సక్రమంగా కల్పిస్తున్నారా అనిసమీక్ష చేశారు. సంతృప్తి చెంది వెళ్లారు. కానీ వాళ్ల సమీక్షలో ఏదో మిస్సయిందని చెప్పడానికన్నట్లు దొంగ ఆ రోజు రాత్రే డ్యూటీ ఎక్కాడు. 


దీంతో పోలీసులు ఎలాగైనా ఆ దొంగను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. డీఎస్పీ, సీఐ స్వయంగా రంగంలోకి దిగారు. కనీసం రూ. పదిహేను లక్షల సొత్తు పోయిందని షాపు యజమాని లబోదిబోమంటున్నాడు. కానీ ఇక్కడపోలీసులకు సొత్తు ఎంత పోయిందన్నది ముఖ్యం కాదు. తమ సమర్థత మీద వచ్చే ప్రశ్నలకు జవాబును ఆ దొంగను పట్టుకోవడం ద్వారా చెప్పడం ముఖ్యం. అందుకే రంగంలోకి దిగారు. దొంగను పట్టుకుంటారో లేదో చూడాలి !