గుంటూరు జిల్లా పెదకాకానిలో మద్యం మత్తులో దారుణం జరిగింది. ఓ మహిళ దారుణమైన తరహాలో హత్యకు గురైంది. ఈ ఘటన పెదకాకాని శివారులోని యువజన నగర్ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన ఝూన్సీకి ఇద్దరు సంతానం ఉన్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పూర్తి వివరాలివీ..


స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలు.. గత కొంత కాలం క్రితం ఝాన్సీ భర్త చనిపోయాడు. పెద్ద కుమార్తెకు కూడా భర్త చనిపోవడంతో పుట్టింట్లో తల్లి వద్దనే ఉంటూ ఉంది. అదే ప్రాంతానికి చెందిన  రసూల్,  సతీష్ బాబు తన కుమార్తెతో మాట్లాడుతున్నారని వారిని ఝాన్సీ అసభ్య పదజాలంతో కనిపించినప్పుడల్లా తిట్టేది. మద్యం అలవాటు ఉన్న ఆమెతో మంచిగా ఉన్నట్లు నటించిన రసూల్, సతీష్ ఆదివారం మద్యం తాగేందుకు ఆటోలో పెదకాకాని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్స్ వెనుక యువజన నగర్ సమీపంలో ఉన్న ప్లాట్లలోకి తీసుకొచ్చారు. ముగ్గురు మద్యం తాగారు. కారణం లేకుండా ఇంటివద్ద ఎందుకు తిడుతున్నావని నిలదీశారు.


ముగ్గురి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఝాన్సీని కర్రతో కొట్టి, బీరు బాటిళ్లతో విచక్షణా రహింతంగా పొడిచి పారిపోయారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఝాన్సీ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.