Guntur Crime News: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఓ ఆటో డ్రైవర్ ను ప్రేమించింది. వద్దని చెబుతున్నా వినకుండా అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన పరువు పోయిందని బావురుమంది. ఊళ్లో వాళ్లు అంటున్న మాటలు వినలేక.. తన కూతురు పరువు తీసి వెళ్లిపోయిందని భావించిన తల్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండారం గ్రామంలో పరువు ఆత్మహత్య చోటు చేసుకుంది.  దాసరి అనితకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం అయింది.  అయితే రెండో కుమార్తె డిగ్రీ చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసుకున్న తల్లి పలుమార్లు కూతురును మందలించింది. ఈ నెల ఏడవ తేదీన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన ఆటో డ్రైవర్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తల్లి అనిత తల్లడిల్లి పోయింది. గ్రామంలో పలు విధాలుగా ప్రచారం జరగడంతో తట్టుకోలేక పోయింది. ఈ ప్రేమ వివాహంతో తమ కుటుంబ పరువు రోడ్డుపై పడిందని ఆవేదన చెందింది.ఈ క్రమంలోనే ఆమె నిన్న రాత్రి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న చేబ్రోలు పోలీసులు విచారణ చేస్తున్నారు.


ప్రేమించిన వాడితో కలహాలు - తట్టుకోలేక యువతి బలవన్మరణం


ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ జంట ప్రయాణం కొంత కాలం బాగానే సాగింది. అనంతరం వారి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ యువతి ఈగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్‌కు అదే గ్రామానికి చెందిన దేవికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే జనవరి 12వ తేదీ నాడు సతీష్‌ పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సతీష్, దేవి మధ్య మరోసారి గొడవ జరిగింది. అనంతరం సతీష్‌ తిరిగి పనికి వెళ్లిపోయాడు.


ఈగల మందు తాగి ఆత్మహత్య 


కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దేవి ఇంట్లో ఉన్న ఈగలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న దేవిని గమనించిన అత్త నిర్మల గమనించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై దేవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవి, సతీష్‌లది ప్రేమ వివాహం అని, అయితే సతీష్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇటీవల దేవి కుటుంబ సభ్యులు సతీష్ ను అడిగితే, దేవిని కొట్టాడని దీంతో మనస్తాపం చెంది ఈగల మందు తాగిందని ఫిర్యాదులో  తెలిపారు. అయితే సతీష్‌ బలవంతంగా తన చెల్లితో ఈగల మందు తాగించాడనే అనుమానం కూడా ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.