Film Producer Kedar Death: దుబాయ్ లో చనిపోయిన తెలుగు నిర్మాత కేదార్ నాథ్ సెలగంశెట్టి ఘటన ఇప్పుడు టాలీవుడ్ తో పాటు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ అవుతోంది..  దుబాయ్ లోనే రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలను కేదార్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన పెట్టే పెట్టుబడి అంతా కొంత మంది సినీ స్టార్ల బ్లాక్ మనీ అని చెబుతున్నారు. బినామీగా కేదార్ పేరుతో పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు. కేదార్ హఠాత్తుగా చనిపోవడంతో ఇప్పుడా పెట్టుబడులన్నీ ఇరుక్కుపోయాయని ఆందోళన చెందుతున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

కేదార్ దుబాయ్ లో హఠాత్తుగా చనిపోయారు. ఎందుకు చనిపోయారన్నది ఇంకా తేలలేదు. దుబాయ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన చనిపోయినసమయంలో తెలంగాణకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆయనతో పాటు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేగా భావిస్తున్నారు. తాను ఉన్నట్లుగా ప్రచారం జరగడంతో తాను కాదని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓ వీడియో రిలీఫ్ చేశారు. కేదార్ చనిపోయారన్న సమాచారం వచ్చింది కానీ…అసలేం జరిగిందన్నది మాత్రం బయటకు రావడండ లేదు. కేసుపై క్లారిటీ వస్తేనే దుబాయ్ పోలీసులు క్లియరెన్స్ ఇస్తారు.  ఇంకాదుబాయ్ పోలీసుల నుంచి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో డెడ్ బాడీని తరలించలేదని చెబుతున్నారు.   పెద్దగా పేరు లేని నిర్మాత మరణం .. మొత్తం పాలిటిక్స్.. సినీ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

కేదార్ నిర్మాతగా మనోజ్ తో రాజు యాదవ్, ఆనంద్ దేవరకొండతో గం గం గణేశా వంటి సినిమాలు తీశారు. పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్న నిర్మాత. సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉంది.దానికి ఆయనే నిర్మాత. రెండు, మూడేళ్ల కిందటే చెరో పది కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చారన్న ప్రచారం ఉంది.    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డు మాట్లాడారు.  ఈ సందర్భంగా దుబాయ్ లో చనిపోయిన నిర్మాత కేదార్ వ్యవహారంపై కూడా మాట్లాడారు.  కేదార్ .. కేటీఆర్ కు వ్యాపారభాగస్వామి అని రేవంత్ రెడ్డి చెప్పారు.ఎందుకు విచారణకు అడగడం లేదని ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నారని విచారణ చేయించుకోవచ్చని కేటీఆర్ ప్రకటించారు.  

 అసలు కేదార్ మృతికి కారణాలేమిటన్నది  ఇప్పుడు తేలాల్సి ఉందన్న వాదన వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకూ నిర్మాత మృతిపై ఎవరూ స్పందించలేదు. గతంలో ఓ బీజేపీ నేత కుమారుడు స్టార్ హోటల్ లో ఇచ్చిన పార్టీలో ఆయన పాల్గొన్నారని కేసు నమోదు అయింది. ఇప్పుడు ఈ కేసు విషయమూ బయటకు వచ్చే చాన్సులు ఉన్నాయి కేదార్ ది అనుమానాస్పద మృతిగా దుబాయ్ పోలీసులు తేలిస్తే సినిమా స్టైల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.       

Also Read:  కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? - ముగిసిన పోలీసుల కస్టడీ !