కడప జిల్లాలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కొడుకునే దారుణంగా కడతేర్చాడు. నిద్రపోతున్న 12 ఏళ్ల కొడుకును గొంతు కోసి కర్కషంగా హతమార్చాడు. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. వివరాలు..  కమలాపురం మండలం ఆగస్త లింగాయపల్లిలో తెల్లవారుజామున నిద్రిస్తున్న కన్నకొడుకును ఓ తండ్రి గొంతుకోసి చంపేశాడు. 


అగస్తలింగాయపల్లెకు చెందిన వీరం రెడ్డి, శంకర్ రెడ్డి కొడుకు సోమేశ్వర్ రెడ్డి(12). బుధవారం తెల్లవారుజామున సోమేశ్వర్ రెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగా శంకర్ రెడ్డి అతి కిరాతకంగా కొడుకు గొంతుకోశాడు. నొప్పితో సోమేశ్వర్ రెడ్డి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. వారిని చూసి శంకర్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న సోమేశ్వర్ రెడ్డిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 


స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు శంకర్ రెడ్డి ఇటీవల మానసికంగా బాగలేడని, మతి స్థిమితం కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


స్థానికుల సమాచారం మేరకు.. నిందితుడు వీరంరెడ్డి శంకర్ రెడ్డి భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో డోజర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకే కొడుకును హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.