Kolkata Case Updates: ఆర్‌జీ కార్ హాస్పిటల్‌కి సంబంధించి మరో చీకటి కోణం బయటపడింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హాస్పిటల్‌లో డెడ్‌బాడీలను అమ్ముకున్నాడని మాజీ డిప్యుటీ సూపరింటెండెంట్ చేసిన ఆరోపణలు సంచలనమవుతున్నాయి. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన వెంటనే సందీప్ ఘోష్ ప్రిన్సిపల్‌ పదవికి రాజీనామా చేశాడు. అప్పటి నుంచి అతనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సీబీఐ అధికారులు మూడు రోజులుగా విచారిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో మాజీ అధికారి చేసిన వ్యాఖ్యలు కేసులో మరో కోణాన్ని బయట పెట్టాయి. అనాథ శవాలను విక్రయించడంతో పాటు బయోమెడికల్ వేస్ట్‌ని బంగ్లాదేశ్‌కి అక్రమంగా తరలించాడని మరో ఆరోపణ చేశాడు. 


"సందీప్ ఘోష్ అనాథ శవాలతో వ్యాపారం చేశాడు. గతంలో అతనిపై ఓ కేసు కూడా నమోదైంది. బయో వ్యర్థాలను పెద్ద ఎత్తున బంగ్లాదేశ్‌కి అక్రమంగా తరలించాడు"


- అక్తర్ అలీ, హాస్పిటల్ మాజీ డిప్యుటీ సూపరింటెండెంట్ 


2023 వరకూ అక్కడే పని చేసిన అక్తర్ అలీ చాలా సార్లు ఈ అక్రమాలపై పోరాటం చేసినట్టు వివరించాడు. విజిలెన్స్ కమిషన్‌కి ఫిర్యాదు చేసినట్టూ చెప్పాడు. ఘోష్‌పై విచారణకు ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగానూ ఉన్నట్టు తెలిపాడు. విచారణ చేపట్టాక దోషిగా తేలినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నిజాలన్నీ బయటపెట్టి రిపోర్ట్ ఇచ్చినందుకు తనను అక్కడి నుంచే వేరే హాస్పిటల్‌కి బదిలీ చేసినట్టు చెప్పాడు. కమిటీలోని మరో ఇద్దరినీ బదిలీ చేశారు. ఈ వ్యక్తి నుంచి విద్యార్థులను కాపాడేందుకు చాలా ప్రయత్నించానని, కానీ ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు మాజీ అధికారి. సందీప్ ఘోష్‌ ఆర్‌జీ కార్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌ పదవికి రాజీనామా చేశాక కలకత్తా మెడికల్ కాలేజీకి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. మమతా బెనర్జీ ప్రభుత్వాన్నీ తీవ్రంగా మందలించింది. హాస్పిటల్‌లో ఆర్థికంగా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. విద్యార్థులను పాస్ చేయడానికి సందీప్ ఘోష్ లంచం తీసుకునే వాడని మాజీ అధికారి అక్తర్ అలీ చెప్పాడు. 


కొంత మంది విద్యార్థులను కావాలనే ఫెయిల్ చేసి వాళ్ల నుంచి డబ్బులు గుంజి మళ్లీ పాస్ చేసే వాడు. హాస్పిటల్‌లో జరిగే ప్రతి పనికి సంబంధించిన టెండర్‌లో 20% కమీషన్ తీసుకునే వాడని అక్తర్ అలీ వివరించాడు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకున్న తరవాతే ఆ టెండర్‌లు అప్పగించేవాడు. అంతే కాదు. బడాబడా వ్యక్తులతో సందీప్ ఘోష్‌కి పరిచయాలున్నాయి. గతంలో రెండుసార్లు బదిలీ అయినా తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి మళ్లీ ఇదే హాస్పిటల్‌కి వచ్చినట్టు అక్తర్ అలీ వివరించాడు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చీడ పురుగుల్లాంటి వాళ్లని, వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు.  ప్రస్తుతం సీబీఐ అధికారులు సందీప్ ఘోష్‌కి లై డిటెక్టర్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన ఏవో నిజాలు దాచి పెడుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే లై డిటెక్టర్ టెస్ట్‌ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిందితుడికీ ఇదే టెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించింది. 


Also Read: Kolkata: నా కూతురికీ ఇలానే నరకం చూపించాడు, ఆ దెబ్బలకు అబార్షన్ అయింది - కోల్‌కతా నిందితుడి అత్త సంచలన వ్యాఖ్యలు