ఆమె ఎప్పట్లాగే  ఏడ్చి ఏడ్చి పడుకుంది. సరిగ్గా అన్నం కూడా తినలేదు. కొంత కాలంగా ఆమెకు అదే దినచర్య. కుటుంబంలో కలహాలు ఆమెకు అలాంటి పరిస్థితి కల్పించాయి.  ఆ రాత్రి కూడా అంతే నిద్రపోయింది .. తెల్లవారు లేచింది. కానీ గదిలో నుంచి బయటకు రాలేకపోయింది. డోర్ తెరవలేకపోయింది. ఎందుకో అర్థం కాలేదు. కానీ అర్థం చేసుకున్న తర్వాత కూలబడిపోయింది. ఎందుకంటే బయట నుంచి తాళాలు వేస్తే సరే కుటుంబకలహాల్లో మరో  స్టేజ్ చేరిందని అనుకునేది . కానీ తలుపు బయట ఏకంగా గోడ కట్టేశారు. దీంతో ఆమె మనసు వికలమయింది. తెలిసిన వారికి ఫోన్లు చేసి.. ఎలాగోలా వేరే మార్గం చూసుకుని బయటకు వచ్చింది. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేమీ సినిమా స్టోరీ కాదు.  తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుల్లారెడ్డి స్వీట్స్ వ్యాపార సంస్థల వారసుడు ఏక్‌నాథ్ రెడ్డి చేసిన ఘనకార్యం.


 
పుల్లారెడ్డి స్వీట్స్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. అయితే ఆయన మనవడు ఏక్ నాథ్ రెడ్డి మాత్రం వివాదాస్పదం అవుతున్నారు. ఆయన వైవాహిక జీవితం సరిగ్గా సాగడం లేదు. ఈ క్రమంలో ఆయన   తన భార్య ను ఇంట్లో నే ఉంచి ఆమెను బయటకు రాకుండా ఉండేందుకు తాను ఇంట్లో ఉన్న రూమ్ లో ఒక అడ్డు గోడను రాత్రి కి రాత్రే నిర్మాణం చేసి అతను ఇంటికి తాళం వేసి పారిపోయాడు. అతి కష్టం మీద ఏక్ నాథ్ రెడ్డి భార్య బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఏక్‌నాథ్ భార్య ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టం తో పాటు గృహ హింస కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ అంశంపై ఏక్ నాథ్ ఇంకా స్పందించలేదు. ఆయన కుటుంబం కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే  వివాహ బంధంలో ఇబ్బందులు ఉంటే కలిసి చర్చించుకోవాలని.. ఒక వేళ కలసి బతకలేకపోతే విడిపోవచ్చు కానీ.. ఇలా ఇళ్లల్లో ఉండగానే గోడలు కట్టేసి పారిపోవడం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 


ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేశామని చెబుతున్నారు. సమాజంలో గౌరవనీయమైన కుటుంబం కావడంతో వీలయినంత వరకూ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు రెండు కుటుంబాలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.  పోలీసులు ఈ కేసు విషయంపై ప్రాథమిక వివరాలు మాత్రమే వెల్లడించారు.