Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో సహజీవనం చేసిన ప్రియుడిపై ఓ ప్రియురాలు పగ పెంచుకుంది. ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్లి అతని 11 ఏళ్ల కొడుకును దారుణంగా హతమార్చింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన పూజా కుమారి అనే 24 ఏళ్ల యువతికి జితేందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జితేందర్‌కు ఇది వరకే పెళ్లై భార్యా పిల్లలు ఉన్నారు. 2019 నుంచి పూజా కుమారి, జితేంద్ర మూడేళ్లు సహజీవనం చేశారు. ఆ తర్వాత పూజను వదిలేసి జితేంతర్ తన భార్య వద్దకు వెళ్లిపోయాడు.


ఈ క్రమంలో జితేందర్‌‌ను కలిసేందుకు పూజా కుమారి శతవిధాలుగా ప్రయత్నించింది. అయితే అతని గురించి ఏమీ తెలియకపోవడంతో తనను వదిలి వెళ్లిపోయాడని పగ పెంచుకుంది. ఎలాగైనా అతన్ని కలవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. చివరకు ఓ కామన్ ఫ్రెండ్‌ ద్వారా ఆగస్ట్ 10న జితేందర్ ఇంటి అడ్రస్ తెలుసుకుంది. జితేందర్‌ను నిలదీయాలని అక్కడకు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. తలుపులు తెరిచే ఉన్నాయి. జితేందర్ కొడుకు దివ్యాంష్‌ బెడ్ మీద పడుకుని ఉన్నాడు. కోపం మీద ఉన్న పూజ ఇదే అదనుగా భావించి దివ్యాంష్‌ గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత దుస్తుల్లో బాలుడి డెడ్ బాడీని ఒక బాక్స్ లో దాచి పెట్టి బయటకు తీసుకొచ్చింది. 


బయటకు వెళ్లిన జితేంతర్ ఇంటికి వచ్చాక కొడుకు కనిపించలేదు. అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఓ వీడియోలో ఒక మహిళ పెట్టెతో సహావ వెళ్లినట్టు గుర్తించారు. ఆమె ఆచూకీ కోసం ఇంద్రపురితో పాటు నజాఫ్‌గఢ్, నాంగ్లోయ్ రహదారిలోని రంహోలా, నిహాల్ విహార్, రిషాల్ గార్డెన్‌లోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆమె ఆ ప్రాంతంలోనే ఉందని, అయితే తాను ఉండే ప్రదేశాలను మారుస్తోందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. 


నిందితురాలని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమె గురించి ఎంత మందిని ప్రశ్నించినా వారికి ఆచూకీ దొరకలేదు. పూజా కుమారి తల్లిదండ్రులను వదిలేసి చాలా కాలం అయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై జితేందర్ మాట్లాడుతూ.. ఆమె తనను పెళ్లి చేసుకోవాలనుకుందని చెప్పారు. పెళ్లికి తన కుమారుడు అడ్డంకిగా మారాడని భావించేదని, అందుకే చంపేసిందని కన్నీరు మున్నీరయ్యాడు. 


పోలీసులు వివరాలు వెల్లడిస్తూ..
వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందన్నారు. జితేందర్, పూజా కుమారి మూడేళ్ల పాటు సహజీవనం చేశారని చెప్పారు. కొద్ది కాలం తరువాత జితేందర్ భార్య దగ్గరకు రావడంతో  పూజా కుమారి  కోపం పెంచుకుందన్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా జితేందర్ ఇంటి చిరునామా తెలుసుకున్న పూజ ఈ నెల 10 తేదీ అక్కడికి వెళ్లిందన్నారు. ఒంటరిగా నిద్రిస్తున్న దివ్యాంష్‌ను దారుణంగా హతమార్చిందన్నారు. బాలుడి డెడ్ బాడీ ఏమైందో తెలుసుకునే పనిలో ఉన్నట్లు చెప్పారు