Dantewada Encounter: గత కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలో దంతెవాడ కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాటే కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే అద్వాల్, కుంజేరా గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు కాల్పులు జరపగా, డిస్ట్రిక్స్ రిజర్వ్ గార్డ్ సెర్చ్ (డీఆర్జీ) ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు మహిళా మావోయిస్టులు హతమయ్యారు.
పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన ముగ్గురు మహిళా మావోయిస్టులపై కలిపి రూ.15 లక్షల వరకు రివార్డు ఉన్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత డిస్ట్రిక్స్ రిజర్వ్ గార్డ్ సెర్చ్ టీమ్ అద్వాల్, కుంజేరా పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఒక్కసారిగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన టీమ్ ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ పీటీఐకి వెల్లడించారు.
Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు
కాటే కల్యాణ్ ఏరియా కమిటీ మెంబర్ రాజే ముచకి, గీతా మార్కమ్, భీమే నుప్పో అలియాస్ జ్యోతి మార్కమ్, కాటే కల్యాణ్ పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయారని ఎస్పీ వెల్లడించారు. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు బోర్ రైఫిల్, రెండు నాటు తుపాకులు, ఐఈడీ వైర్, మెడిసిన్, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మహిళా మావోయిస్టులు ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు.
14 మంది మావోయిస్టులు లొంగుబాటు..
కరోనా వైరస్ వ్యాప్తి మావోయిస్టులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి తరువాత మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. ఇదివరకే కొందరు మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మావోయిస్టులు ఇతరత్రా అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. తమ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో గత కొంతకాలం నుంచి మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధపడుతున్నారు.
Also Read: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
తాజాగా జరిగిన ఎన్కౌంటర్కు కొన్ని గంటల ముందు ఛత్తీస్ గఢ్లో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ ముందు ఈ మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో రూ.లక్ష రివార్డు ఉన్న సన్నా మార్కం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జన జీవన స్రవంతిలో కలిపిపోయేందుకు నిర్ణయించుకున్న మావోయిస్టులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఎస్పీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు.