- ప్రేమ పేరుతో మోసపోయిన పదో తరగతి విద్యార్థిని
- ప్రేమించిన వ్యక్తి వేధించడంతో భరించలేక ఆత్మహత్య
- ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకున్న బాలిక
- అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో అన్నయ్య అంటూ సూసైడ్‌ లెటర్‌
- బాలిక ప్రేమించినది మైనర్‌ బాలుడినని చెప్తున్న పోలీసులు


తెలిసీ తెలియని వయస్సు. మంచిగా మాట్లాడితే... ప్రేమ అనుకుని భ్రమపడతారు. ఎవరో తెలియకుండా... వారి వలలో చిక్కుకుంటారు. వారు చెప్పిందల్లా చేస్తారు. చివరగా తాము మోసపోయామని తెలుసుకుని తట్టుకోలేరు. కొందరైతే ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తారు. ఇలాంటి విషాద సంఘటనే నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. 


నిజామాబాద్‌ జిల్లా యాలాల మండలం హాజీపూర్‌ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో మురివేసుకుని ప్రాణాలు తీసుకుంది. బాలిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలిసింది. ప్రవళిక... యాలాల జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం... బాలిక తల్లి కూరగాయల మార్కెట్​కు వెళ్లి ఇంటికి తిరిగివచ్చింది. ఇంట్లో దూలానికి ఉరేసుకుని వేలాడుతున్న కూతుర్ని చూసి ఆందోళన చెందింది. పెద్దగా కేకలు వేసింది. అందరూ వచ్చి బాలికను కిందికి దించారు. అప్పటికే ప్రవళిక మృతిచెందింది. దీంతో గుండెలవిసేలా రోధించారు తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక రాసిన సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


బాలిక రాసిన సూసైడ్‌ లెటర్‌ అందరికీ కంటతడి పెట్టింది. అన్నయ్య.. అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో అంటూ లెటర్‌ రాసింది బాలిక. తాను ప్రేమ పేరుతో మోసపోయానని.. ఒకరు టార్చర్​ చేస్తున్నారని రాసింది. వేధింపులు భరించలేకపోతున్నానని... ఇక, బతకాలని లేదని, అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నాను అని లెటర్‌లో రాసింది. నా లైఫ్​ ముగిసింది.. మిమ్మల్ని మిస్​ అవుతున్నాను అంటూ బాలిక రాసిన సూసైడ్​నోట్ చదివిన వారందరికీ కన్నీరు తెప్పించింది.


ప్రవళిక.. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని పోలీసుల విచారణలో తేలింది. వారి మధ్య విభేదాలు వచ్చాయి. ప్రేమించిన వ్యక్తి సోషల్​ మీడియాలో ఆమెను వేధిస్తున్నాడని గుర్తించారు. అందుకే బాలిక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతని ఫోన్​ నంబర్ ​సూసైడ్ ​లెటర్​లో రాసి ఉంది. ప్రేమించిన వ్యక్తి మైనర్ ​అని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. 


చిన్న వయసులో ప్రేమ, ఆకర్షణ లాంటి విషయాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు, అధికారులు, పోలీసులు తరచుగా సూచిస్తుంటారు. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు సైతం జీవితం నాశనం అవుతుందని.. కొన్నిసార్లు రెండు కుటుంబాలు రోడ్డున పడతాయని అంటున్నారు. పరువు పేరుతో కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకుటాయని, లేకపోతే పరువు హత్య పేరుతో అమ్మాయి, అబ్బాయిలను చంపేస్తున్న ఘటనలు ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఓ కంట కనిపెడుతుండాలని సూచించారు.