Gold Smuggling: ఎవరికీ ఊహకందని రీతిలో బంగారాన్ని స్మగ్లింగ్ చేశాడో వ్యక్తి. కడుపులో దాచుకొని, షూలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, ఆకరికి ఇన్నర్ వేర్లలో దాచి స్మగ్లింగ్ చేసే వార్తలు విన్నాం కానీ ఇది మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఏకంగా మలద్వారంలో బంగారాన్ని దాచి అక్రమంగా తరలించాడు. వినడానికి ఎలాగో ఉన్నా ఇది నిజం. ఇంత చేసినా పోలీసులకు దొరికిపోయాడా వ్యక్తి. ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


కేరళ కొచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్ లో నింపి.. మలద్వారంలో బంగారాన్ని దాచుకుని తరలిస్తున్న గుర్తించిన పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకొని అతడిని అరెస్ట్ చేశారు. కోజికోడ్ జిల్లా కొడువాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దోహా నుంచి బుధవారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అదుపులోకి తీసుకొని సోదాలు చేపట్టగా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలింది.  అయితే అతడి నుంచి సుమారు 1066.75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మహారాష్ట్రలోని ముంబయులో నాలుగు వేర్వేరు ఘటనల్లో సుమారు 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 7.87 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 


ఇటీవలే శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పేస్టు..


హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసోం నుంచి హైదరాబాద్ కు వచ్చిన విమానంలో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో లాండ్ అవ్వగానే సోదాలు చేయగా ఓ వ్యక్తి సీటు కింద పాకెట్‌లో పేస్ట్ రూపంలో ఉన్న 472.8 గ్రాముల బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం ధర రూ. 23.33 లక్షలు అని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నిత్యం బంగారం పట్టుబడుతున్న వార్తలు వెలుగుచూస్తున్నాయి. ఎయిర్​పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కువగా అరబ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అధికారులు అంటున్నారు. 


సూట్ కేస్ రైలింగ్ లో బంగారం


నవంబర్ 27న దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 410 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పసిడి విలువ రూ.20.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పౌడర్ టిన్, సూట్ కేస్ రైలింగ్ లో బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.  


బంగారం తరలిస్తున్న ముగ్గురు మహిళలు అరెస్ట్


శంషాబాద్‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌ లో నవంబర్ 22న బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. బంగారం, విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ పలువురు అధికారులకు చిక్కుతున్నారు. రాజీవ్‌ గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. యూఏఈ, యుఎస్ కరెన్సీని తరలిస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11.49 లక్షల విలువైన యూఏఈ కరెన్సీ, యుఎస్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మరో మహిళ దగ్గర రూ. 17.69 లక్షలు విలువ చేసే బంగారం బిస్కెట్లను ఎయిర్ పోర్ట్ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.