AP Government Enquiry On Hidden Cameras Incident In Krishna District: కృష్ణా జిల్లా (Krishna District) గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలోని (Gudlavalleru Engineering College) అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) విచారణకు ఆదేశించారు. హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై వెంటనే విచారణ జరపాలని అన్నారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం నిర్ధేశించారు. కాగా, ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన అమ్మాయిల హాస్టల్‌ బాత్రూంలో ఓ కెమెరా ఉండడాన్ని విద్యార్థినులు గుర్తించారు. దీనిపై హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ ఘటనపై విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. టార్చ్ లైట్ల వెలుతురులో 'వి వాంట్ జస్టిస్' అంటూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో కాలేజీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 






ఇది చేసింది ఎవరంటే.?


అయితే, ఇదంతా చేసింది ఓ అమ్మాయేనని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అదే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినే ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొంటున్నారు. ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీయిస్తున్నట్లు చెప్పారు. ఇలా తీసిన వీడియోలను కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా కూడా కాలేజీ వర్గాలు, విద్యార్థులు అనుమానిస్తున్నారు. 


ఆ విద్యార్థిపై దాడి


బాలికల వాష్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు విక్రయిస్తున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులను అదుపు చేశారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని ప్రశ్నించి.. అతని ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ ఈ ఘటనపై అధికారికంగా ఏ సమాచారం బయటకు రాలేదు. ఎంతమంది అమ్మాయిల వీడియోలను తీశారు దీనికి కారణం ప్రేమ వ్యవహారమా.. లేదా ఘటనకు కారణమైన విద్యార్థిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాల్లోనూ సమాచారాన్ని అధికారులు బయటకు చెప్పటం లేదు. 


కేసు నమోదు


మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని కృష్ణా జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ల్యాప్ టాప్స్, మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్‌ను పోలీసులు పరిశీలించారని చెప్పారు. నేరారోపణ చేసే ఎలాంటి అంశాలు బయటపడలేదని పేర్కొన్నారు. విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని.. తదుపరి విచారణ పురోగతిలో ఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు






మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన వీడియోలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లకు ట్యాగ్ చేస్తూ ఈ విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


Also Read: Mumbai Actress Case : మంబై నటికి వేధింపుల కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు - ఏపీ ప్రభుత్వం ఆదేశం