బస్సులో నిలబడి ప్రయాణిస్తున్నవారిన చూసి కొంతమంది పట్టించుకోరు, ఇంకొంతమంది జాలిపడతారు కానీ ఇంకేమీ చేయరు, మరికొంతమంది మాత్రం తాము లేచి సీటు ఇస్తారు, లేదా సర్దుకుని వారికి కూడా స్థానం చూపిస్తారు. అలాంటి జాలి ఉన్నవారే ఆమె టార్గెట్, లేచి సీటిస్తామంటే వద్దంటుంది, పక్కకి జరగండి బాబు చాలు అంటూ పక్కనే కూర్చుంటుంది. ఇక ఆ తర్వాత ఆమె చేసేది ఏంటంటే..?


కేరాఫ్ కుప్పం..


చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన పసుపులేటి రేణుక ఓ దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. అలాంటి రేణుకకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా 10.32 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఆమె సింగిల్ అటెంప్ట్ లో దొంగిలించింది. అయితే ఆ తర్వాతే పోలీసులకు చిక్కింది. నెల్లూరు జిల్లా కావలి పోలీసుల రేణుకను అరెస్ట్ చేశారు. బంగారం స్వాధీనం చేసుకున్నారు.


రేణుక ఎలా దొంగతనం చేస్తుందంటే..?


చంటి బిడ్డను చంకన వేసుకుని రేణుక బస్సు ఎక్కుతుంది. రద్దీగా ఉన్న బస్సుని చూసుకుని మరీ ఆమె ఎక్కుతుంది. ఆ తర్వాత ఎవరైనా అమాయకంగా కనిపిస్తే వారి సీటు పక్కన వెళ్లి నిలబడుతుంది, ఇక యాక్షన్ మొదలు పెడుతుంది. బాబూ.. చిన్న బిడ్డ ఉన్నాడయ్యా.. నిలబడలేను.. కొంచెం సీటు ఇవ్వండయ్యా.. మీకు పుణ్యం ఉంటుంది అంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది. చేతిలో చిన్న బిడ్డ ఉంటాడు కాబట్టి ఆమె మాటలు నిజమనుకుని నమ్మి చాలామంది సీటు ఇస్తారు. ఆ తర్వాత వారితో మాట కలిపి వారి దగ్గర ఉన్న వస్తువులను దొంగతనం చేసి మధ్యలోనే దిగిపోతుంది రేణుక. ఆ తర్వాత స్టేజీ వచ్చాక వారు జేబులు చూసుకుంటే ఖాళీగా ఉంటాయి, పర్సుల్లో విలువైన వస్తువులు మాయమవుతాయి. అలా రేణుక ఇప్పటికే చాలా దొంగతనాలు చేసింది.


తాజా చోరీ ఎలాగంటే..?


ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని దావగూడూరుకు చెందిన కోసూరి వెంకటేశ్వర్లు నవంబర్ 15వ తేదీన కొంత ముడి బంగారం తీసుకుని బస్సు ఎక్కాడు. దాని బరువు 344 గ్రాములు, ధర సుమారు రూ.10.32 లక్షలు. సింగరాయకొండ నుంచి నెల్లూరు వచ్చేందుకు ఆయన బస్సు ఎక్కారు. అతడిని గమనించిన  రేణుక చిన్నారితో కలసి అదే బస్సు ఎక్కింది. బిడ్డకు చోటివ్వాలని ప్రాధేయపడి ఆయన పక్కనే వచ్చి కూర్చుంది. మార్గమధ్యంలో అతని బ్యాగ్‌ లోని బంగారాన్ని ఆమె దొంగిలించింది. కావలిలోని ఉదయగిరి ఫ్లైఓవర్ వద్ద బస్సు దిగిపోయింది రేణుక. వెంకటేశ్వర్లు బస్సు కావలి వచ్చాక దిగి బ్యాగ్ చూసుకోగా అందులో బంగారం లేదు. పోలీసులను ఫిర్యాదు చేశాడు వెంకటేశ్వర్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు చాలా చోట్ల వెతికారు.


చివరకు కావలి బస్టాండ్‌ లో ఉన్న రేణుకను అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర ఉన్న 344 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణుకపై అప్పటికే ప్రకాశం జిల్లాలోని కంభం, నెల్లూరు జిల్లాలోని సంగం స్టేషన్‌ లో పలు కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు. 2012 నుంచి దొంగతనం వృత్తిగా మార్చుకున్న రేణుక ఇప్పుడు మరోసారి పోలీసులకు చిక్కింది. నిందితురాలని పట్టుకోవడంతోపాటు, బంగారాన్ని జాగ్రత్తగా రికవరీ చేశారు పోలీసులు.