Chhattisgarh Crime: 


ఛత్తీస్‌గఢ్‌లో దారుణం..


ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తి ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. నిందితుడికి అప్పటికే పెళ్లైంది. అయినా ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. చాలా రోజులుగా ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఏదో సమాధానం చెప్పి ఇన్నాళ్లూ దాటేస్తూ వచ్చాడు. కానీ...కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుపట్టడం వల్ల ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చూశాడు. గొంతు నులిమి చంపేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యని, పిల్లల్ని వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం వల్లే హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. చాలా రోజులుగా ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవలు జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇంట్లోనే ఓ తాడుతో ఉరి బిగించి చంపేసినట్టు ఒప్పుకున్నాడు. మృతురాలి పేరు వేదమతి. వయసు 46. ఆమెకీ పెళ్లైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఈ పిల్లలకూ పెళ్లైంది. భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే నిందితుడు దుర్గా ధ్రుత్లహరేతో పరిచయమైంది. ఇద్దరికీ ఓ ప్రైవేట్ కంపెనీలో పరిచయమైనట్టు విచారణలో తేలింది. భార్యతో విడాకులు కాకపోయినప్పటికీ...వేదమతితో ఉండేందుకు ఇల్లు వదిలేసి వచ్చాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి చేసింది. అందుకు ఒప్పుకోని దుర్గా...గొంతు నులిమి చంపాడు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. 


బెంగళూరులోనూ ఇదే తరహా హత్య..


బెంగళూరులో ఓ 29 ఏళ్ల యువకుడు లివిన్ పార్ట్‌నర్‌ని కుక్కర్‌తో కొట్టి చంపాడు. గత నెల 26న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. తనను మోసం చేసే వేరే వ్యక్తితో యువతి చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు యువకుడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ప్రెజర్ కుక్కర్‌తో గట్టిగా యువతిని కొట్టాడు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఇద్దరూ కేరళకు చెందిన వాళ్లే. దాదాపు రెండేళ్లుగా బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. కాలేజ్‌ రోజుల నుంచే ఇద్దరికీ పరిచయం ఉంది. కోరమంగళలోని ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే...తనతో సహజీవనం చేస్తూ వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కోపంతో గొడవకు దిగాడు నిందితుడు వైష్ణవ్. మాటామాట పెరిగింది. కుక్కర్‌తో గట్టిగా కొట్టాడు. మృతురాలి ఫోన్ స్విచ్ఛాప్ రావడం వల్ల ఆమె సోదరి కంగారు పడింది. ఇంటికి వెళ్లి చూసింది. అక్కడా కనిపించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చాక ఈ దారుణం వెలుగు చూసింది. యువతిని చంపిన తరవాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అన్ని చోట్లా గాలించిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు.  వీళ్లిద్దరూ లివిన్‌లో ఉన్నారని తల్లిదండ్రులకు కూడా తెలుసని వెల్లడించారు పోలీసులు. వాళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసినా పట్టించుకోలేదని, అదే ఈ హత్యకు దారి తీసిందని చెప్పారు. స్థానికులు కూడా ఈ జంట పదేపదే గొడవ పడేదని చెబుతున్నారు. 


Also Read: Tribal Woman: రాజస్థాన్‌లో ప్రభుత్వం ఉందా? గిరిజన మహిళ ఘటనపై జేపీ నడ్డా ఫైర్