Chandigarh Crime News: బాబాలు అనగానే.. భక్తిభావంతో మనందరి మొహాలు వెలిగిపోతుంటాయి. కానీ ఆధ్యాత్మిక ముసుగులో ఆకృత్యాలకు పాల్పడే పలువురు బాబాల మొహం చూస్తే మాత్రం కోపం, అసహ్యంతో రగిలిపోతుంటాం. ఇప్పుడు కూడా అలాంటి బాబా గురించే మనం చూడబోతున్నాం. చండీఘర్ లో జిలేబీ బాబాగా పేరొందిన అతడు.. దాదాపు 120 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేనా ఆ ఆకృత్యాన్నంతా వీడియోగా తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. చివరకు అతడి పాపం పండడంతో.. ఫతేహాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. జిలేబీ బాబాకు కోర్టు జైలు శిక్షతో పాటు 35 వేల రూపాయలు జరిమానాగా విధించింది. 


అసలేం జరిగిందంటే..?


63 ఏళ్ల జిలేబీ బాబా అసలు పేరు అమర్ వీర్. ఇది కాకుండా అతడికి అమర్ పురి, బిల్లురామ్ అని కూడా పేర్లు ఉన్నాయి. హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లా తోహనా పట్టణంలో ఉంటున్న జిలేబీ తొలుత పంజాబ్ లోని మాన్సా జిల్లా నుంచి 18 ఏళ్ల వయసులోనే ఫతేహాబాద్ కు వలస వచ్చాడు. అక్కడే జిలేబీలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఇలా అతడికి ఆ పేరు స్థిర పడిపోయింది. తనకు తాంత్రిక విద్యలు తెలుసని, వాటితో దెయ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తానంటూ ప్రజల్ని నమ్మించేవాడట. అతడి భక్తుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. మహిళల్లో తనపట్ల ఉన్న విశ్యాసాన్ని అలుసుగా తీసుకున్న జిలేబీ బాబా తన వద్దకు వచ్చే అమాయక మహిళలపై అత్యాచారం చేసేవాడు.


ముందుగా సదరు మహిళలకు మత్తు మందు ఇచ్చేవాడు. వాళ్లు స్పృహ కోల్పోయాక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఆ ఆకృత్యాన్నంతిటినీ వీడియో తీసేవాడు. వారికి స్పహ వచ్చాక తన అసలు రంగు బయట పెట్టేవాడు. డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలు బయట పెడతాను, బంధువులకు పంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో భయపడిపోయిన మహిళలు అతడు అడిగినంత డబ్బు ఇవ్వడం వంటివి చేసేవాడు. ఈ క్రమంలోనే 2018లో ఓ ఆలయంలో తనపై అత్యాచారం చేశాడంటూ అతడి పరిచయస్థుల్లో ఒకరి భార్య ఆరోపించడంతో జిలేబీ బాబాపై తొలి కేసు నమోదు అయింది. అప్పట్లోనే విచారణ ప్రారంభం కాగా... ఆ తర్వాత మరిన్ని కేసులు వచ్చాయి. 


ఈ క్రమంలోనే ఈనెల ఆరంభంలో న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చడంతో శిక్ష పడింది. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... జిలేబీ బాబా మహిళలపై లైంగి వేధింపులకు పాల్పడుతున్న వీడియో తమకు మొబైల్ ఫోన్ లో లభించినట్లు తెలిపారు. అనంతరం మహిళలపై ఆకృత్యాలకు సంబంధించిన 120 వీడియోలను గుర్తించినట్లు తెలిపారు. అతడి ఇంట్లో సోదాలు చేయగా.. కొన్ని మత్తు మాత్రలతో పాటు వీసీఆర్ తో పాటు మహిళలకు మంత్ర చికిత్స అందించే సాకుతో వారిని మోసం చేేందుకు ఉపయోగించే బూడిద వంటి పదార్థాలను గుర్తించినట్లు తెలిపారు. తన వద్దకు వచ్చే మహిళలకు మత్తు మందు ఇచ్చి వారిపై ఆకృత్యాలకు పాల్పడి... వాటిని మొబైల్ ఫోన్ లో చిత్రీకరించేవాడు. ఆపై బెదిరిస్తూ అందినకాడికి దోచుకునేవాడిని పోలీసులు వివరించారు.