CBI Investigation On NEET - UG 24 Paper Leak: నీట్ యూజీ - 2024 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేయగా కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం 144 మంది అభ్యర్థులు డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ గత వారం మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పరీక్ష జరగడానికి కొద్ది గంటల ముందే ఝార్ఖండ్‌ హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ నుంచి పంకజ్ కుమార్ అనే వ్యక్తి చేతుల మీదుగా నీట్ పేపర్ లీక్ అయినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సహకారంతోనే పేపర్ బయటకు వచ్చినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. 


దర్యాప్తులో ఏం తేలిందంటే.?


'నీట్ పరీక్ష జరిగిన రోజు (మే 5) ఉదయం 8 గంటలకు ప్రశ్నపత్రాలు పాఠశాలకు చేరుకున్నాయి. ఆ టైంలో పరీక్షా కేంద్రానికి కోఆర్డినేటర్‌గా ఉన్న హసనుల్ హక్.. ఐఐటీ జెంషడ్‌పూర్‌కు చెందిన ఓ సివిల్ ఇంజినీర్‌ను ప్రశ్నాపత్రం బాక్స్ ఉన్న గదిలోకి పంపించాడు. ప్రత్యేక టూల్ కిట్ సాయంతో ఆ పెట్టెను తెరిచాడు. ప్రశ్నాపత్రం మొత్తాన్ని ఫోటో తీసుకున్నాడు. అనంతరం యథావిధిగా దాన్ని పెట్టెలో పెట్టి మునుపటిలానే సీల్ వేశాడు. బయటకు వచ్చిన అనంతరం ఆ ప్రశ్నపత్రాన్ని ఓ గెస్ట్ హౌస్‌లో ఉన్న మరో వ్యక్తికి పంపించాడు. అక్కడున్న 9 మంది వైద్య విద్యార్థులు ప్రశ్నపత్రానికి సమాధానాలు పూర్తి చేశారు. వాటిని వివిధ ప్రాంతాల్లోని గ్యాంగ్ సభ్యులకు పంపించారు. ఆ తర్వాత డబ్బులు చెల్లించిన అభ్యర్థులకు వాటిని చేరవేశారు.' అని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. కాగా, పేపర్ లీకేజీకి సంబంధించి 298 మంది సాక్షులు, 290 డాక్యుమెంట్లు, 45 మార్గాల్లో లభించిన సమాచారం ఆధారంగా 5,500 పేజీల ఛార్జ్ షీట్‌ను సీబీఐ రూపొందించింది.


Also Read: Viral News : మరి పెళ్లంటే అన్నీ చూసుకోవాలి బ్రో - వధువు కోసం ఓ మగాడిచ్చిన ప్రకటన వైరల్