Cyber Criminals Arrested By CBI In Visakha: విశాఖలో (Visakha) ఐదుగురు సైబర్ నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో సైబర్ నేరాల (Cyber Crime) కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. నగరంలో నివాసం ఉంటున్న అక్షయపత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షుశర్మ, పార్త్‌బాలి, పి.నవీన్ చంద్ర పటేల్ స్థానిక బిర్లా జంక్షన్ వద్ద ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారు. వీరు గత కొంతకాలంగా ఆన్ లైన్‌లో మోసాలకు పాల్పడుతూ.. పలువురి నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ, ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి ల్యాప్ టాప్స్, హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీబీఐ వారి కస్టడీలోకి తీసుకుంది. అటు, నగరంలోని పలు కాల్ సెంటర్లనూ తనిఖీ చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఒకే ఖాతాలో రూ.124 కోట్లు


మరోవైపు, తెలంగాణలో ఒకే ఖాతాలో రూ.124 కోట్లు బదిలీ కావడం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన రూ.కోట్ల సొమ్మును హైదరాబాద్‌లోని పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయించుకున్న కేసుకు సంబంధించి దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. నగరంలో శంశీర్‌గంజ్ ఎస్బీఐ శాఖలోని 6 కరెంట్ ఖాతాల్లోకి సైబర్ నేరాల సొమ్ము బదిలీ కావడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరింటిలోని ఒకే బ్యాంకు ఖాతాలోకి ఏకంగా రూ.124.25 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు. 'ప్రొవెన్ ఏహెచ్ఎం ఫ్యుజన్' సంస్థ పేరిట ఉన్న ఈ ఖాతాల్లోకి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సొమ్ము జమ అయింది. ఇది మహ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ పేరిట ఉన్నట్లు తేలింది. ఇతడి పేరిటే ఉన్న మరో ఖాతాలోకి రూ.34.19 లక్షలు వచ్చినట్లు వెల్లడి కాగా అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలోనే అతను కమీషన్ కోసం బ్యాంక్ ఖాతాను సమకూర్చాడని (మ్యూల్) తేలింది. దుబాయ్‌లో ఉన్న సూత్రధారి సూచన మేరకే తాను బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు నిందితుడు వెల్లడించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన సొమ్మును హవాలా మార్గంతో పాటు ఫారిన్ ఎక్స్ఛేంజీల ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. 


అటు, మిగిలిన 5 ఖాతాలూ మ్యూల్స్‌వే అని తేలింది. ఈ క్రమంలో అసలు సూత్రధారి దొరికితేనే కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఖాతాలోకి చేరిన రూ.124.25 కోట్ల నగదు 234 నేరాలకు సంబంధించిందిగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సాధారణంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)కు వచ్చే ఫిర్యాదుల్ని టీజీసీఎస్‌బీ పోలీసులు విశ్లేషిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శంశీర్ గంజ్ ఎస్బీఐ ఖాతాలో భారీగా సైబర్ నేరాల సొమ్ము బదిలీ కావడంపై వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 2 నెలల్లోనే 6 కరెంట్ ఖాతాల్లోకి సుమారు రూ.150 కోట్ల వరకూ లావాదేవీలు జరగడంతో ముమ్మర విచారణ చేయగా అసలు విషయం వెలుగుచూసింది.


Also Read: Telangana BJP : నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ?