- వీరి కన్నుపడితే ఎటువంటి బైక్‌ అయినా గాయబ్‌.. 
- బైక్ చోరీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాజమండ్రి పోలీసులు
- నిందితుల వద్ద నుంచి  31 బైక్‌లు స్వాధీనం


వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు గుంటూరు పోలీస్‌ స్టేషన్లు పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఏకంగా 31 బైక్‌లు దొంగిలించిన ముగ్గురు దొంగల ముఠా రాజమండ్రి పోలీసుకుల చిక్కారు. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి ఆదేశాలమేరకు డీఎస్పీ దొంగల ముఠా గురించిన విషయాలు వెల్లడించారు..


తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన గూడే పవన్‌కుమార్‌, రాజమండ్రి తాడితోటకు చెందిన ఎర్రారపు సత్యనారాయణ, అలియాస్‌ ఎర్రవలపు సత్యనారాయణ, అలియాస్‌ చిన్నా, రాజమండ్రి తాడితోటకు చెందిన గుత్తాల నవీన్‌కుమార్‌ ముగ్గురు కలిసి జట్టుగా దొంగతనాలకు పాల్పడుతూ బైక్‌లనే టార్గెట్‌ చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. 


ఓ షోరూమ్ పెట్టేయొచ్చు... 
చిక్కరు, దొరకరు అనే పంథాలో పోలీసులు కళ్లు గప్పి తిరుగుతోన్న ముగ్గురు దొంగల ముఠాను రాజమంద్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలిశాయి. వీరి వద్దనుంచి ఒకటి కాదు ఐదు కాడు, పదికాదు ఏకంగా 31 ఖరీదైన బైక్‌లు స్వాధనం చేసుకున్నారు పోలీసులు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లను చూస్తే ఓ బైక్‌ షోరూమ్‌నే పెట్టేయొచ్చు అన్నంతగా వీరి దోపిడీ సాగింది.


ప్లాన్ చేసి పట్టుకున్నారిలా.. 
జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి ఉత్తర్వుల మేరకు అడిషనల్‌ ఎస్పీ(క్రైమ్‌) జి.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సౌత్‌ డీఎస్పీ ఎం.శ్రీలత ఆధ్వర్యంలో వీరిపై నిఘా పెంచారు. ఈ క్రమంలో రెండో పట్టణ ఎస్సై జీవీవీ సత్యనారాయణ, సిబ్బంది కలిసి రాజమండ్రిలోని తూర్పు రైల్వే క్వార్టర్స్‌ గార్డ్‌ లైన్‌ వద్ద ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. 


బొమ్మూరు నుంచి గుంటూరు.. 
తూర్పుగోదావరి జిల్లా బమ్మూరు నుంచి వీరి దొంగతనాల ప్రస్థానం గుంటూరు వరకు సాగిందని పోలీసులు వివరించారు. బమ్మూరు, ప్రకాష్‌నగర్‌, ధవళేశ్వరం, మండపేట, అనపర్తి, అమలాపురం, కాకినాడ, భీమవరం, గుంటూరు పోలీస్‌ స్టేషన్లు పరిధిలో వీరి దొంగతనాలు జరిగాయని పోలీసులు వెల్లడించారు. వీరు ఈజీ మనీ, జల్సాలకు అలవాడు బైకులను లక్ష్యంగా చేసుకుని ఖరీదైన బైకులను చోరీ చేశారని పోలీసులు వివరించారు.


బైక్ పై నిలబడి యువకుడు ర్యాష్ డ్రైవింగ్, స్టంట్స్ 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఓ యువకుడు తన బైక్‌పై నిలబడి అత్యంత వేగంగా ప్రమాదకరంగా బైక్‌ నడిపాడు. అయితే ఆ బైక్ వెనకాలే వెళ్తున్న కారులోని యజమాని విషయాన్ని గుర్తించి వీడియో తీశాడు. ఆ యువకుడు ఎంత వేగంగా, ప్రమాదకరంగా బండి నడుపుతున్నది వివరించాడు. తాము కారులో వెళ్తున్నా అతడిని పట్టుకోలేకపోతున్నామని కూడా చెప్పాడు. అంత వేగంగా ఎవర్ని చంపేందుకు వెళ్తున్నాడో అర్థం కావడం లేదంటూ కామెంట్రీ ఇచ్చాడు. ఆనంతరం ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. స్థానికంగా ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. ఎట్టకేలకు పోలీసుల దగ్గరకూ ఆ వీడియో చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. బండి నెంబర్ ఆధారంగా సదరు ఆకతాయిని అరెస్ట్ చేశారు. ప్రమాదకర స్థితిలో బైక్ నిలబడి అతి వేగంగా బండి నడిపిన యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ బండిని సీజ్ చేశారు. ఇలా ప్రమాదకరంగా వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.