YSRCP MLC Anantababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ కోసం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు 90 రోజుల్లో ఛార్జ్‌షీట్‌ ఫైల్ చేయనందున బెయిల్‌ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసింది. కింది కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో అనంతబాబు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్ లో అనంతబాబు రిమాండ్ లో ఉన్నారు. ఇటీవలే అనంతబాబు రిమాండ్‌ ను స్థానిక ఎస్సీ, ఎస్టీ కోర్టు మరోసారి పొడిగించింది. అక్టోబర్‌ 7 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. 


88 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ 


కాకినాడలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసులో పోలీసులు సుమారు 88 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఎస్సీ యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై పోలీసులు ఇటీవల న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23వ తేదీ  ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల ఈ కేసులో పోలీసులు ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు చాలా వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అప్పట్లో ఆరోపించారు. 


అక్టోబర్ 7 వరకు రిమాండ్ 


ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో పోలీసులు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.  మానవ హక్కుల సంఘాలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు ఆందోళనలతో దిగివచ్చిన పోలీసులు ఆఖరికి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో అనంతబాబు రిమాండ్ ను అక్టోబర్ 7 వరకు పొడిగించింది.  మృతుని కుటుంబం తరుపున ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు న్యాయపోరాటం చేస్తు్న్నారు. హైకోర్టులో మాజీ న్యాయమూర్తి, న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. 


డ్రైవర్ హత్య కలకలం 


డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో తెచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అనంతరం అనంతబాబు పరారీలో ఉన్నాడు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు హాజరవుతూ ఏం జరగనట్లే వ్యవహరించారు. అయితే ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని అరెస్టుచేశారు. నిందితుడు ఎమ్మెల్సీపై 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. మే 19న ఘటన జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని అప్పట్లో పోలీసులు తెలిపారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఇగో హర్ట్ అయ్యి నెట్టడంతో డ్రైవర్ చనిపోయాడని ఎస్పీ ఇచ్చిన వివరణపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. 


Also Read : Nara Lokesh: ‘‘పేటీఎం డాగ్స్! ఇదే రియల్ వెన్నుపోటు, పక్కా ప్రూఫ్స్ ఇవిగో’’ నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్


Also Read : Lakshmi Parvathi: ఎన్టీఆర్‌తో పెళ్లి ఆయనకిష్టం లేదు, మైకు వైర్లు కట్ చేసి రచ్చ - జగన్ నిర్ణయం కరెక్టే: లక్ష్మీ పార్వతి