ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో ఆరుగురిని శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. తాజాగా జలగం వెంకట సత్యనారాయణ, గుడా శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్, కిషోర్, అజయ్, అమృత్ లను సీబీఐ ఇవాళ అరెస్టు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తున్నాయని న్యాయ వ్యవస్థతో పాటు జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారు. ఈ కేసులను ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. 2020 అక్టోబర్ 8న ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ విచారణకు ముందు ఏపీ సీఐడీ అధికారులు ఈ కేసును విచారించారు. సీఐడీ విచారణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 


Also Read: చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... పరిటాల సునీత సంచలన కామెంట్స్


వైసీపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేపై ఛార్జ్ షీట్


 ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది జులై, ఆగష్టు నెలలో నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిలో ఆదర్ష్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివరెడ్డి, సుధీర్ లను  సీబీఐ అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ లో వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ నెల 6న సీబీఐ ఏపీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది. ఈ కేసులో వైసీపీకి చెందిన ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ తెలిపింది. ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. 


Also Read: కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు.. ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ డిమాండ్ !


సోషల్ మీడియాలో ట్రోలింగ్


న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియా వేదికగా దూషించిన వారిపై ఆంధ్రప్రదేశ్  హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనలో గతంలో 49 మందికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎంపీ నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. వైసీపీ అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికగా జడ్జిలను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయస్థానం, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ చర్యలకు ఆదేశించింది. అనంతరం ఈ కేసులపై ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. సీఐడీ నుంచి కేసులను సీబీఐకి హైకోర్టు అప్పగించింది. 


Also Read: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు... ఐదుగురిని అరెస్టు చేసిన సీబీఐ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి