ACB Raids In Tirupati: ఏసీబీ వలకు మరో చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో తిరుపతి బీసీ వెల్ఫేర్ డీడీ ఆర్.యుగంధర్ ఇంట్లో అనంతపురం, తిరుపతి అవినీతి నిరోధక శాఖ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించింది. బుధవారం ఉదయం 6.25 నిమిషాల నుంచి డీడీ యుగంధర్ గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంటితో పాటు కార్యాలయం, మరో మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు అనంతపురం ఇంచార్జ్ ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. ఏసీబీ సోదాల్లో యుగంధర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినట్లు నిర్ధారణ అయిందన్నారు. కాకినాడలో రెండస్థుల భవనాలు రెండు, ఓ అపార్ట్మెంట్, ఐదు ఇళ్ల స్థలాలు ఉన్నాయని వాటికీ సంబంధిన డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 




విజయవాడ, తూర్పు గోదావరి ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని గుర్తించామని చెప్పారు. 850 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కేజీల వెండి ఆభరణాలు సీజ్ చేశామన్నారు. కేవలం తిరుమలలో దొరికిన ఆస్తుల విలువ కోటి 70 లక్షలు కాగా... మిగిలిన ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల విలువ ఇంకా తేలలేదని తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని... తనిఖీలు ముగిసిన అనంతరం మరిన్ని వివరాలు తెలుపుతామన్నారు.




ఆరు నెలల కిందట సూళ్లూరుపేటలో.. 


ఏసీబీ అధికారులు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో హడావిడి పడ్డాడు మున్సిపల్ కమిషనర్. తన దగ్గర ఉన్న డబ్బుల కట్టల్ని కిటికీనుంచి బయటపడేశారు. మొక్కల్లో సంచి పడిపోయింది కదా తనను పట్టించుకోరని అనుకున్నారాయన. కానీ చివరకు ఏసీబీ ఆ సంచిని స్వాధీనం చేసుకుంది. సంచిలో ఉన్న 1.13 లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కమిషనర్ కారులోని డ్యాష్ బోర్డ్ లో మరో 50 వేల రూపాయలు బయటపడింది. ఆయన బీరువాలో మరో 30 వేల రూపాయలు కూడా దొరికాయి. మొత్తం లక్షా 93 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్త సాధారణ తనిఖీల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కానీ పక్కా సమాచారంతోనే వారు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లారని తెలుస్తోంది. పంచాయతీ సెక్రటరీగా ఉంటూ ప్రమోషన్ మీద మున్సిపల్ కమిషనర్ అయ్యారు నాగిశెట్టి నరేంద్రకుమార్. గతంలో ఆయన వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు. ఆ తర్వాత సూళ్లూరుపేట బదిలీపై వచ్చారు. 


బుధవారం ఉదయాన్నే ఏసీపీ అధికారులు సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్ లో తనిఖీలు చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌ ఆధ్వర్యంలో టీమ్ సూళ్లూరుపేట చేరుకుంది. మున్సిపల్ ఉద్యోగులను లోపల ఉంచి తలుపులు వేసి సోదాలు మొదలు పెట్టారు. కమిషనర్‌ నాగిశెట్టి నరేంద్రకుమార్‌ ఛాంబర్‌ లో పక్కనే కిటికీ ఉంది. ఏసీ ఉంటుంది కాబట్టి సహజంగా ఆ కిటికీ మూసేస్తారు. కానీ అధికారులు ఎంట్రీ ఇచ్చే సమయానికి కిటికీ తెరిచి ఉంది. దీంతో వారికి అనుమానం వచ్చింది. బయట కిటికీ దగ్గరకు వెళ్లి చూసే సరికి సంచిలో రూ.1.13 లక్షల నగదు ఉంది. దీంతోపాటు మరికొంత నగదుని కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ బృందం సోదాలు చేసింది. అప్పటి వరకూ బయటకు అధికారిక సమాచారం రాలేదు. ఆ తర్వాత అధికారికంగా ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని తెలిపారు ఏసీబీ సిబ్బంది. సూళ్లూరుపేట మున్సిపాల్టీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా 110 ఇళ్ల నిర్మాణాలు జరిగాయని, 50 ఇళ్ల నిర్మాణాలు అనుమతులకు విరుద్ధంగా జరిగాయని గుర్తించారు అధికారులు. కమిషనర్‌ నరేంద్రకుమార్‌ సాధారణ పనిదినాల్లో రోజూ రాత్రి 8 గంటలకు వరకు ఆఫీస్ లోనే ఉంటారని, సెలవు రోజుల్లోనూ కష్టపడి పడనిచేస్తుంటారని సిబ్బంది చెబుతున్నారు. సెలవు రోజుల్లో కూడా ఇంత కష్టపడి పనిచేయడంపై స్థానికులకు అనుమానం వచ్చింది. నలుగురు వ్యక్తులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం బయటపడింది. ఈరోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి.