Attack On Line Inspector In Hyderabad: హైదరాబాద్ నగరంలో శుక్రవారం దారుణం జరిగింది. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలు చెల్లించాలని అడిగినందుకు ఓ యువకుడు విద్యుత్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ - సనత్ నగర్‌లో జరిగింది. లైన్ ఇన్‌స్పెక్టర్ సాయిగణేష్ రోజూ లాగానే ఆ ప్రాంతంలో విద్యుత్ బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే రాములు అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లిన పెండింగ్ విద్యుత్ బిల్లు చెల్లించాలని అడిగాడు. అయితే, ఇంటి యజమాని అందుకు నిరాకరించగా.. కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఇంటి యజమాని కొడుకు మురళీధర్ రావు (19).. లైన్ ఇన్‌స్పెక్టర్‌పై పిడిగుద్దులు కురిపించాడు.


అందరూ చూస్తుండగానే దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంతలో అక్కడకు వచ్చిన స్థానికులు యువకున్ని అడ్డుకున్నారు. అయినా, వెనక్కు తగ్గని సదరు యువకుడు లైన్ ఇన్‌స్పెక్టర్, అతనితో వచ్చిన సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా, దాడి చేసిన యువకుడు బాక్సర్ అని తెలుస్తోంది. యువకుని దాడిలో లైన్ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై బాధితుడు సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. 


విద్యుత్ అధికారుల సీరియస్


అయితే, బకాయిలు ఉన్నా ఇప్పటివరకూ కట్టకపోగా అడిగిన సిబ్బందిపైనే దాడి చేయడంపై విద్యుత్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి సరికాదని.. దీనిపై విచారణ చేపడతామని అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తామని స్పష్టం చేశారు.


Also Read: Nizamabad: డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చి పసుపు సంచుల లారీ హైజాక్ - పలుచోట్ల పసుపు విక్రయం