హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సినిమాలో అవకాశాల పేరుతో నటిపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఢిల్లీకి చెందిన భోజ్‌పురి నటి గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడి చేతిలో లైంగిక దాడికి గురైంది. ఇంటర్వ్యూ సాకుతో నటిని హోటల్‌కు పిలిచి దారుణానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను భోజ్‌పురి ఎంటర్‌టైనర్ అని, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నానని పోలీసులకు తెలిపింది. 


కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకు మహేష్ పాండే అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తానని చెప్పి జూన్ 29న గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని హోటల్‌కి పిలిచాడని ఫిర్యాదులో తెలిపింది. ఇంకా తన బాధను వివరిస్తూ.. హోటల్‌కు చేరుకునే సమయానికి అప్పటికే మహేష్ గది బుక్ చేశాడని, దాంట్లోకి తనను తీసుకెళ్లి  కొన్ని ప్రశ్నలు అడిగాడని పేర్కొంది. ఆ తర్వాత అతను మద్యం తాగడం ప్రారంభించాడని, తాను బయలుదేరుతుండగా బలవంతంగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. పాండే తనను చంపేస్తానని బెదిరించాడని, అతని స్నేహితులు కొందరు తనకు ఫోన్‌ చేసి, పోలీసుల వద్దకు వెళ్తే తన ప్రైవేట్ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతామంటూ బెదిరించారని మహిళ పేర్కొంది.


మహిళ ఫిర్యాదు మేరకు, గురుగ్రామ్‌లోని చకర్‌పూర్ ప్రాంతంలో నివసించే మహేష్ పాండేపై IPC సెక్షన్ 376 (అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ ఉద్దేశం) కింద ఉద్యోగ్ విహార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బుధవారం ఏసీపీ వరుణ్ దహియా స్పందిస్తూ త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. 


డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఆపై లైంగిక దాడి
ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళకు ఒక వ్యక్తి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 50లో ఈ ఘోరం జరిగింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని హోటల్లో కలిసేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మహిళకు మత్తుపదార్థాలు ఇచ్చి తన స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడు. ఆ దారుణాన్ని, చిత్రీకరించి బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
మహిళ ఫిర్యాదు ప్రకారం.. మహిళకు ఓ డేటింగ్ యాప్‌లో వ్యక్తి పరిచయమయ్యాడు. కలుద్దామంటూ బాధితురాలిని జూన్ 29న హోటల్‌కు ఆహ్వానించాడు. ఆమె అతన్ని కలవడానికి అక్కడికి వెళ్లింది. అప్పటికే దుర్బుద్దితో ఉన్న స్నేహితుడు ఆమెకు మత్తు పదార్థాలు కలిపిన భోజనం తినిపించాడు. దీంతో ఆమె కొద్ది సేపటికే ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత ఆమెను హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి స్నేహితుడితో కలిసి స్పృహ లేకుండా పడిఉన్న మహిళపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. లైంగిక దాడి చేస్తుండగా వీడియో రికార్డు కూడా చేశాడు. ఆ తరువాత వీడియోను బహిరంగంగా పెడతానని నిందితుడు బెదిరించ సాగాడు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు అతి కష్టం మీద పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం అంతా వారికి వివరించింది. సామూహిక అత్యాచారం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లు ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ మాలిక్ తెలిపారు.