A Man Hanged Himslef In Visakhapatnam: విశాఖలో (Visakha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన పిల్లల అల్లరి మాన్పించేందుకు ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలు బలిగొనేలా చేసింది. 'మీరు అల్లరి చేస్తే.. నేను చచ్చిపోతా' అంటూ సదరు వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు చీర కట్టి దాన్ని మెడకు చుట్టుకుని కుటుంబ సభ్యుల్ని భయపెట్టే ప్రయత్నం చేయబోగా.. అది బిగుసుకుపోయి మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్. ఐదేళ్ల నుంచి వీరి కుటుంబం 89వ వార్డు కొత్తపాలెంలో నివాసం ఉంటోంది. వీరికి ఓ కుమార్తె (7), కుమారుడు (5) ఉన్నారు. బుధవారం రాత్రి ఇద్దరు పిల్లలూ ఆయన చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను చించేశారు. ఈ క్రమంలో పిల్లలపై చిరాకు పడుతున్న క్రమంలో భార్య అడ్డుపడింది. దీంతో భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవ జరిగింది.


బెదిరించే క్రమంలో..


తనకు ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తే.. ఆత్మహత్య చేసుకుంటానని చందన్ కుమార్ బెదిరించాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆయన ఫ్యాన్ హుక్‌కు చీర కట్టి దాన్ని మెడకు చుట్టుకుని కుటుంబ సభ్యుల్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు చీర బిగుసుకుపోయింది. దీంతో కొన ఊపిరితో చందన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన భార్య వెంటనే అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై విచారణ చేస్తున్నారు.


Also Read: Andhra Pradesh: ప్రాణహాని ఉంది కాపాడండి- హోంమంత్రి అనితను కలిసిన ఫిర్యాదు చేసిన మదన్మోహన్