Home Minister Anita: ఓ ప్రభుత్వం ఉద్యోగి ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. భార్య బిడ్డ చుట్టూకొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపై భర్త మదన్మోహన్ మీడియా ముఖంగా అనేక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో వైసీపీకి చెందిన ముఖ్య నేత, రాజ్యసభ ఎంపీని కూడా వివాదంలోకి లాగారు. దీనిపై సదరు నేత కూడా స్పందిస్తూ ఈ తరహా ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఖండించారు. అదే సమయంలో మదన్మోహన్ చేసిన ఆరోపణలపై ఆ ఉద్యోగి కూడా స్పందించారు. తాను సన్నిహితంగా మెలిగినంత మాత్రాన ఈ తరహా ఆరోపణ చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. మదన్మోహన్ తో తాను ఎప్పుడో విడిపోయానని, తాను సుభాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆయనతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. సుభాష్ కూడా స్పందించారు. తాను సన్నిహితంగా మెలిగానని, తనకు వేరే సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగినట్టు ఆయింది.  ఇప్పుడు మదన్మోహన్ హోం మంత్రి అనితను కలిసి గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. 


తన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ విజ్ఞప్తి 


తమ ఫ్యామిలీ ఇష్యూ తేల్చాలంటూ మదన్మోహన్ హోం మంత్రి అనితను విజయవాడలో కలిసి గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఈ సందర్భంగా హోం మంత్రిని ఆయన కోరారు. అదే సమయంలో తన బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా ఆయన హోం మంత్రికి చేసిన ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదుపై హోం మంత్రి ఎలా స్పందిస్తారని దానిపైన ఆసక్తి నెలకొంది. దీనిపై విచారణకు ఆదేశిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 


గడిచిన వారం రోజుల నుంచి ఇది టాపిక్ గా మారింది. తాజాగా మదన్మోహన్ బీచ్ లో డాన్స్ చేసిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలు మీడియాలో ప్రచురితమైన కథనాలపై ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో స్పందించిన ఆయన కొంతమంది మీడియా ప్రతినిధులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూతురు వయసు ఉన్న ఉద్యోగితో తనకు సంబంధాలను ముడిపెట్టేలా కథనాలు వండి వడ్డిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీటిపైన తాను ఉన్నత స్థాయిలో ఫిర్యాదులు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తనను అభాసుపాలు చేసిన కొందరు మీడియా ప్రతినిధులను పార్లమెంటుకు ఈడుస్తానని హెచ్చరించారు. అదే సమయంలో మీడియాను అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించిన విజయసాయిరెడ్డి తాను మీడియాను కూడా పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మదన్మోహన్ హోంమంత్రికి ఫిర్యాదు చేయడం సర్వత్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంపై శాంతి కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీదకు లాగుతున్నారంటూ బోరున విలపించారు.