From Wedding Bells to Funeral Rites : ఆయనకు 75 ఏళ్లు. భార్య మరణించడంతో తను ఓంటరిగా మిగిలాడు. పిల్లలు కూడా లేరు. అందుకే పెళ్లి చేసుకున్నాడు. 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నారు. కానీ అదే అతని జీవితంలో చివరి రోజుగా మారింది.
యూపలోని జౌన్పూర్ జిల్లా కుచ్చముచ్చ గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు సంగ్రురామ్, తన 35 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్న మరుసటి రోజు ఉదయం అకస్మాత్తుగా మరణించాడు. ఈ ఘటన గ్రామాన్ని షాక్కు గురిచేసింది. సంగ్రురామ్, కుచ్ఛముచ్ఛ గ్రామంలోని ఒక సాధారణ రైతు. గతేడాది తన మొదటి భార్య మరణించిన తర్వాత, పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. తనకు ఎవరూ లేరని, వారసులు దూరంగా ఉన్నారని చెప్పుకుంటూ, సహవాసం కోసం మళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. జలాల్పూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల యువతి సంబంధాన్ని మధ్యవర్తులు తీసుకు వచ్చారు. ఆమెకు కూడా రెండో పెళ్లే. మొదటి వివాహం ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె మొదటి భర్త చనిపోయాడు. సంగ్రురామ్ తన ఆదాయంతో పిల్లలను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతకు ఎదిరించి, సెప్టెంబర్ 29న రిజిస్టర్డ్ వివాహం చేసుకున్నాడు. తర్వాత స్థానిక ఆలయంలో సాంప్రదాయ వివాహం జరుపుకున్నారు.
వివాహం తర్వాత ఆ రాత్రి జంట ఎక్కువ సేపు మాట్లాడుకున్నట్టు యువతి గ్రామస్థులకు చెప్పింది. అయితే, సెప్టెంబర్ 30న ఉదయం సంగ్రురామ్ ఆరోగ్యం ఆకస్మికంగా దిగజారింది. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మరణించాడని ప్రకటించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినా, ఢిల్లీలో ఉండే బంధువులు వచ్చే వరకూ అంత్యక్రియలు ఆపమని పోస్ట్మార్టమ్ జరగాలని డిమాండ్ చేశారు.
కుటుంబ సభ్యులు మరణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. "వివాహం రోజు ఆయన ఆరోగ్యం బాగుంది. ఇంత త్వరగా ఏమైంది? అని బంధువులు ప్రశ్నిస్తున్నారు. గ్రామస్థుల మధ్య కూడా రెండు వాదనలు ఉన్నాయి. కొందరు "వయస్సు కారణంగా హార్ట్ అటాక్ వచ్చి ఉండవచ్చు" అని చెబుతున్నారు, మరికొందరు "వివాహం వల్ల ఒత్తిడి, లేదా వేరే కారణాలు ఉండవచ్చు" అని అనుమానిస్తున్నారు. యువతి మాత్రం "ఆయన ఆరోగ్యం బాగుంది, మేము సాధారణంగా మాట్లాడుకున్నాం" అని చెబుతోంది.
కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున, పోస్ట్మార్టమ్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. అధికారిక కేసు నమోదు చేయలేదు. పెళ్లి వీడియో వైరల్ అవుతోంది, ఇందులో వివాహ సమయంలో సంగ్రురామ్ సంతోషంగా కనిపిస్తున్నాడు.