Killed By 40 Crocodiles:


ప్రమాదావశాత్తు ఎన్‌క్లోజర్‌లో పడిపోయి..


కంబోడియాలో దారుణం జరిగింది. ఏకంగా 40 మొసళ్లు ఓ వ్యక్తిపై దాడి చేసి ముక్కలు ముక్కలు చేశాయి. శరీరంలోని భాగాలను ఛిద్రం చేసి తినేశాయి. ఓ ఫామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ 72 ఏళ్ల వృద్ధుడు ప్రమాదావశాత్తు ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు. వెంటనే 40 మొసళ్లు దాడి చేశాయి. ఓ కేజ్‌లో ఉన్న మొసలి గుడ్లు పెట్టింది. అయితే..అక్కడి నుంచి మొసలిని తప్పించేందుకు ఓ స్టిక్‌తో దానిని కదిలించాడు. ఎంతకీ అది కదలలేదు. మరోసారి గట్టిగా ఆకర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా...ఆ కర్రను మొసలి నోట కరుచుకుంది. వెంటనే గట్టిగా లాగింది. ఆ కర్రతో పాటు ఆ వృద్ధుడు కూడా ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు. అక్కడ ఉన్న మొసళ్లు ఒక్కసారిగా దాడి చేసి శరీరాన్ని చీల్చేశాయి. 


"ఓ కేజ్‌లో మొసలి గుడ్లు పెట్టింది. అక్కడి నుంచి దాన్ని వేరే చోటకు మార్చేందుకు ఆ వృద్ధుడు ప్రయత్నించాడు. కర్రతో కొట్టాడు. అప్పుడే ఆ మొసలి కర్రను నోట కరుచుకుని లాగేసింది. అప్పుడే ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు. పక్కనే ఉన్న మొసళ్లు వచ్చి అతడి శరీరాన్ని ఛిద్రం చేసేశాయి. కాపాడే టైమ్ కూడా మాకు లేకుండా పోయింది. ఓ చేయిని పూర్తిగా కొరికేసి మింగేశాయి"


- ఫామ్ సిబ్బంది


ఇప్పుడే కాదు. గతంలోనూ ఓ రెండేళ్ల చిన్నారిని ఇలానే చంపేశాయి మొసళ్లు. 2019లో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు అందులో పడిపోగా...వెంటనే దాడి చేసి మింగేశాయి. 


ఇటీవల ఆస్ట్రేలియాలో..


చేపల వేట కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు ఎంత గాలించినా దొరకలేదు. ఎక్కడా కనిపించలేదు. చివరకు డెడ్‌బాడీ దొరికింది. ఎక్కడో తెలుసా..? రెండు మొసళ్లలో. ఈ షాకింగ్ ఘటన...ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌ల్యాండ్‌లో జరిగింది. మూడు రోజుల క్రితం కెవిన్ డార్మొడీ చేపలు పట్టేందుకు ఓ చెరువులోకి వెళ్లాడు. అక్కడ మొసళ్లు కనిపించాయి. వెంటనే వాటిని తరిమి కొట్టాడు. అవి వెళ్లిపోయాక చేపలు పట్టడం మొదలు పెట్టాడు. ఆ పక్కనే ఓ పబ్ ఉంది. ఆ పబ్ మేనేజర్‌కి ఉన్నట్టుండి పెద్దగా అరుపులు వినిపించాయి. నీళ్ల చప్పుడు కూడా వినిపించింది. బయటకు వచ్చి చూసే సరికి ఆ వృద్ధుడు కనిపించలేదు. అక్కడ మొసళ్లు తిరుగుతున్న విషయాన్ని గుర్తించిన రేంజర్లు వెంటనే నీళ్లలోకి దిగారు. ఆ రెండింటినీ కాల్చి చంపేశారు. వాటిలో ఒకటి 14 అడుగుల పొడవు ఉండగా...మరోటి 9 అడుగుల పొడవు ఉంది. చేపల వేటకు వచ్చే వారిని ఇవి చంపేస్తున్నాయని గుర్తించారు. వేటాడి చంపేశారు. ఆ రెండు మొసళ్లను ఎగ్జామిన్ చేయగా...వాటి కడుపులో ఆ వృద్ధుడి శరీర భాగాలు కనిపించాయి. ఆ ప్రాంతంలో మొసళ్లు ఎక్కువ అని పోలీసులు వెల్లడించారు. అందుకే నీళ్లలోకి వెళ్లే ముందే జాగ్రత్త పడాలని సూచించారు. మొసళ్ల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందుకే వాటి సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు. 


Also Read: Sengol Politics: రాజదండంపై రాజకీయాలు, కాంగ్రెస్ అలా బీజేపీ ఇలా - ఇంతకీ ఏది నిజం?