Latest Telugu Crime News: తెలుగు రాష్ట్రాల్లో 24 గంటల వ్యవధిలో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ దుర్ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

  


డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. మరో 20 మందికి గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్‌ కర్నూలుకు సమీపంలో బోల్తాపడింది. కోడూమురు వద్ద అదుపుతప్పి ప్రమాదం జరిగింది. బస్‌ నిండా ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మరో 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. వాళ్లను సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 


తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఓ ట్రావెల్స్ బస్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్‌లో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నిర్మల్ జిల్లాలోని సారంగ్‌పూర్ వద్ద ప్రమాదం జరిగింది. 


బుధవారం రాత్రి నెల్లూరు జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. పది మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న బస్‌ నెల్లూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది. దగదర్తిలోని సున్నపుబట్టీ వద్ద జాతీయ రహదారిపై ఉన్న కంటైనర్‌ను బస్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా... గాయపడ్డా పది మంది ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 


విశాఖలోని ఎన్ఏడి ఫ్లై ఓవర్‌పై ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వేకువజామున జరగడంతో పెను ముప్పు తప్పింది.  ఆ టైంలో రోడ్డపై ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌ చిన్న గాయాలతో బయటపడ్డారు. ఒడిశా నుంచి గాజువాక ఆటోనగర్‌లో పేపర్ లోడింగ్‌ కోసం వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాఫిక్‌కి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.