UP Crime: 



యూపీలో ఘటన..


యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన ఓ 23 ఏళ్ల యువకుడిని...యువతి కుటుంబ సభ్యులు కొట్టి చంపారు. యువతి తండ్రితో పాటు ఆమె సోదరులు ఆ యువకుడిపై దాడి చేసి ఐరన్‌ రాడ్లతో దారుణంగా కొట్టారు. ఫలితంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు యువకుడు. ఈ కేసులో ముగ్గురు నిందితులనూ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...పర్వేజ్ ఘజియాబాద్‌లోని ఖోడా ప్రాంతంలో ఉన్న గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఆమె మైనర్. అంతే కాదు. వీరిద్దరి మతాలూ వేరు. ఎప్పటి నుంచో వీళ్ల ప్రేమని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఏకంగా ఆ యువకుడు ఇంటికి రావడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమె తండ్రితో పాటు మరో ఇద్దరు యువకులు దాడి చేసి హత్య చేశారు. కానీ..పోలీసులకు మాత్రం వేరే స్టోరీ చెప్పారు. ఆ యువకుడు తమ ఇంటికి దొంగతనానికి వచ్చాడని, తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడ్డాడని చెప్పారు. అప్పటికప్పుడు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. .అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఆ తరవాత విచారణ చేపట్టారు పోలీసులు. అప్పటి వరకూ దొంగగానే భావించినప్పటికీ...ఆ యువతిని ఇంటరాగేట్ చేసిన తరవాత కానీ అసలు విషయం బయట పడలేదు. వెంటనే ఆ ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 


ముస్లిం యువకుడిపై దాడి..


యూపీలోని  బులందశర్‌లో ఓ ముస్లిం యువకుడిని ముగ్గురు దారుణంగా కొట్టారు. "జై శ్రీరాం" అని నినాదాలు చేయాలంటూ చితకబాదారు. అలా కొడుతూ వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు ఆ వీడియోలోని ఇద్దరు నిందితులనీ అదుపులోకి తీసుకున్నారు. జూన్ 13న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. జూన్ 17న వాళ్లను అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం..జూన్ 13వ తేదీన బాధితుడు సాహిల్ బస్‌స్టాండ్‌లో నిలబడి ఉన్నాడు. అప్పుడే ఓ ముగ్గురు యువకులు బైక్‌పైన వచ్చి బలవంతంగా సాహిల్‌ని కూర్చోబెట్టుకున్నారు. ఎవరూ లేని చోటకు తీసుకెళ్లారు. తమలో ఒకరి మొబైల్ పోయిందని, చోరీ చేసింది నువ్వేనా అని ప్రశ్నించారు. తనకేమీ తెలియదని బాధితుడు బదులిచ్చాడు. ఆ తరవాత ముగ్గురూ చెట్టుకి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. గుండుకొట్టించారు. జై శ్రీరాం అని గట్టిగా నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే...పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా తనపై దొంగతనం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపించాడు బాధితుడు. బాధిత కుటుంబ సభ్యులు ASPని ఆశ్రయించారు. ఆయనకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని సాక్ష్యంగా చూపించారు. ఆ తరవాత విచారణ మొదలు పెట్టిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 


Also Read: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం- కదిలే బస్‌లో మంటలు, 25 మంది సజీవదహనం