People Died In Gujarat And Haryana Accidents: పండుగపూట వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. హర్యానా రాష్ట్రంలో కారు కాలువలోకి దూసుకెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. అటు, గుజరాత్ రాష్ట్రంలో భూగర్బ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల ప్రకారం.. హరియాణా రాష్ట్రం కైతాల్ జిల్లాలోని ముండ్రి గ్రామంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీగ్ గ్రామానికి చెందిన కొంతమంది దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన బాబా రాజ్‌పురి మేళాలో పాల్గొనేందుకు కారులో వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సహా సభ్యులు మొత్తం 9 మంది ఉన్నారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏడుగురి మృతదేహాలను కాలువ నుంచి వెలికితీశారు. ఈ ఘటనలో డ్రైవర్, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. 12 ఏళ్ల బాలిక కోసం గాలింపు చేపడుతున్నారు.


గుజరాత్‌లోనూ తీవ్ర విషాదం


అటు, గుజరాత్‌లోనూ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో ఓ నిర్మాణ స్థలంలో మట్టిపెళ్లలు విరిగి పడి ఏడుగురు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలోని జసల్‌పూర్ గ్రామంలో కార్మికులు భూగర్భ ట్యాంకు కోసం గొవ్వు తవ్వుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందికి కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. 'ఇదో ప్రైవేట్ కంపెనీ. ప్రస్తుతం నిర్మాణం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. 10 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోగా ఏడుగురు మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీశాం.' అని మెహసానా జిల్లా అధికారి హస్రత్ జాస్మిన్ తెలిపారు.






ప్రధాని మోదీ దిగ్భ్రాంతి


ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందించనున్నట్లు తెలిపారు.






Also Read: Train Accident: సిగ్నల్, మార్గం మధ్య మిస్‌మ్యాచ్ వల్లే! - తమిళనాడు రైలు ప్రమాదానికి అదే కారణమా?, విచారణకు రైల్వే శాఖ ఆదేశం