Zomato Employee Shares: ఫుడ్‌ అగ్రిగేటర్‌ కంపెనీ జొమాటో (Zomato) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌ కింద 4,65,51,600 ఈక్విటీ షేర్లను ఉద్యోగులకు కేటాయించింది. కేవలం ఒక్క రూపాయికే వీటిని కేటాయించడం గమనార్హం.


ప్రస్తుతం జొమాటో షేర్లు విపరీతమైన సెల్లింగ్‌ ప్రెజర్‌ ఎదుర్కొంటున్నాయి. మంగళవారం షేరు ధర జీవిత కాల కనిష్ఠమైన రూ.40కి పడిపోయింది. స్టాక్‌ మార్కెట్లో నమోదై ఏడాది గడవడంతో లాకిన్‌ పిరియడ్‌ ముగిసింది. దాంతో ఇన్వెస్టర్లు ఒక్కసారి షేర్లను తెగనమ్మారు. ఒకట్రెండు సెషన్లలోనే 25 శాతం మేర పతనమైంది. అయినప్పటికీ రూ.188.75 కోట్ల విలువైన షేర్లను ఒక రూపాయి ధరతో రూ.4.66 కోట్లకే కేటాయించడం విశేషమే! అంటే దాదాపుగా 98 శాతం డిస్కౌంట్‌ ఇచ్చారు.



కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలోని నామినేషన్‌, రెమ్యూనరేషన్ కమిటీ 4.6 కోట్ల ఈక్విటీ షేర్లను ఉద్యోగులకు కేటాయించేందుకు ఆమోదం తెలిపినట్టు సెబీకి జొమాటో తెలిపింది. గతేడాది జొమాటో లిస్టింగ్‌ సూపర్ హిట్టైంది. కానీ ఆ తర్వాత ఇన్వెస్టర్ల నమ్మకం కోల్పోయింది. లక్ష కోట్ల మార్కెట్‌ విలువ ఇప్పుడు రూ.35 వేల కోట్లకు చేరుకుంది. లిస్టై ఏడాది గడవడంతో 78 శాతం లేదా 613 కోట్ల షేర్ల లాకిన్‌ పిరయడ్‌ ముగిసింది. బీఎస్‌ఈలో 145 మిలియన్లు, ఎన్‌ఎస్‌ఈలో 220 మిలియన్ల షేర్లు చేతుల మారాయి.


షేరు ధర దారుణంగా పతనమైనా కొనుగోలు చేయొచ్చని కొన్ని బ్రోకరేజ్‌ కంపెనీలు సూచిస్తున్నాయి. మున్ముందు లాభాల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో ఔట్‌ పెర్ఫామ్ చేస్తుందని క్రెడిట్‌ సూయిస్‌ చెబుతోంది. జెఫెరీస్ సైతం బుల్లిష్‌గానే ఉంది. త్వరలోనే కంపెనీ బ్రేక్‌ ఈవెన్‌కు వస్తుందని అంచనా వేసింది. 130 శాతం షేరు ధర పెరిగే అవకాశం ఉందని, రూ.100 టార్గెట్‌గా ఇచ్చింది.