Bengaluru:


బెంగళూరు నగరంలో కిరాయికి ఇల్లు దొరకడం గగనమైపోయింది. ఒక మంచి రూమ్‌ లేదా ఇంటిని వెతికి పట్టాలంటే వారాలు, నెలలు పడుతోంది. ఒకవేళ దొరికినా అద్దె చెప్పగానే అందరి కళ్లూ బైర్లు కమ్ముతున్నాయి. కొవిడ్ ముందు నాటితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. దాంతో ఏం చేయాలో తెలియక ఉద్యోగులు, కుటంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు ఇదే అదనుగా మంచి వ్యాపార అవకాశాలు సృష్టించుకుంటున్నారు. కిరాయి ఇళ్లను చూపించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు.


చాలా మంది ఉద్యోగులు వీకెండ్‌ రాగానే బెంగళూరు నగరంలో కిరాయి ఇళ్ల వేట (Rent) మొదలు పెడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే బయల్దేరుతున్నారు. తన మిత్రుడి ఇంట్లో తాత్కాలికంగా బస చేస్తున్న డాక్టర్‌ ఆకాశ్ సింగ్‌ది ఇదే పరిస్థితి! 'కోరమంగల చుట్టుపక్కల టు లెట్‌ బోర్డులు ఉన్నాయేమో చూసేందుకు వెళ్తాను. అయితే బెంగళూరు నగరంలో (Bangalore)  ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. రోజులో ఒక్క ఇంటినైనా వెతికి పట్టుకోవడం చాలా కష్టమవుతోంది. ఈ ప్రాంతంలోని మంచి ఇళ్లలో సింగిల్‌ బెడ్‌రూమ్‌ కనీస అద్దె రూ.20,000 ఉంది. గతంలో ఇక్కడ రూ.10000-14000 ఉండేది' అని ఆయన వాపోతున్నారు. పైగా నాలుగైదు గంటలు బయటకు వెళ్తొస్తుంటే ప్రయాణాలు, క్యాబులు, ఇతర ఖర్చులకు జేబులు ఖాళీ అవుతున్నాయని బాధపడుతున్నారు.


కీర్తిగౌడ బెంగళూరులో టెకీ. కొన్ని అపార్టుమెంట్లలో ఫ్లాట్ల కోసం బ్రోకర్స్‌ను ఎంచుకుంది. బ్రోకర్‌ను బట్టి ఒక్కసారి బయటకు వెళ్తే రూ.1000-2000 అవుతోందని చెప్పారు. ఆ డబ్బులకు సాధారణంగా వాళ్లు ఐదారు ఇళ్లను చూపిస్తున్నారని పేర్కొన్నారు.


బెంగళూరు నగరంలో ఇళ్ల కొరత విపరీతంగా ఏర్పడింది. డిమాండ్‌కు తగినట్టుగా ఖాళీ ఇళ్లు కనిపించడం లేదు. దాంతో అద్దెలు (Rentals) ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 40 శాతం మేర కిరాయి పెంచారని తెలిసింది. దీంతో బ్రోకర్లు కొందరు ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించుకొని 'ఇళ్ల వేట ప్యాకేజీలు' ప్రకటిస్తున్నారు. రియాల్టీ కార్ప్స్‌ ఫౌండర్ సునిల్‌ సింగ్‌ ఇలాగే చేశారు. అపార్టమెంట్లలో అద్దె ఫ్లాట్ల కోసం వెతుకుతున్న వారికి ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌ నడుపుతున్నారు. ఎంచుకొనే వాహనాలు, ఇతర సౌకర్యాలను బట్టి రూ.10వేలకు ఐదారు ఇళ్లను చూపిస్తున్నారట. పికప్‌, డ్రాప్‌ అప్‌, టీ, స్నాక్స్‌, భోజనం వంటివి ఏర్పాటు చేస్తున్నారు.


Also Read: వంద రూపాయల పెట్టుబడికి 89 రూపాయల లాభం, అదరగొట్టిన నెట్‌వెబ్ టెక్నాలజీస్ లిస్టింగ్‌


నేరుగా విమానాశ్రయం నుంచే ఇలాంటి సేవలు అందిస్తున్నారని తెలిసింది. వీరి ప్యాకేజీల విలువ చాలా ఎక్కువ. 'నగరంలో అద్దె ఇళ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. కొవిడ్‌ వల్ల సాఫ్ట్‌వేర్‌ సహా అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. దాంతో వీరంతా సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. కంపెనీలు ఇప్పుడు వెనక్కి పిలిపిస్తుండటంతో ఒక్కసారిగా అద్దె కొరత ఏర్పడింది. వైట్‌ఫీల్డ్‌ వంటి ప్రైమ్‌ లోకేషన్లలో 2BHK ఇంటి అద్దె నెలకు రూ.35,000-38,000కు పెరిగింది. గతంలో ఇక్కడ రూ.25,000 ఉండేది.


గేటెడ్‌ కమ్యూనిటీల్లో అపార్ట్‌మెంట్లు రూ.50,000 కన్నా తక్కువకు లేవు. ఇందిరా నగర్‌లోని సర్జాపురాలో 3BHK అద్దె ఏకంగా రూ.80,000. అద్దెలు పెరగడంతో చాలామంది శివారు ప్రాంతాలకు వెళ్తున్నారని తెలిసింది. హొసూరు, బెగూరు వంటి ప్రాంతాల్లో 2BHK రూ.15,000-20,000 దొరుకుతున్నాయి. అయితే ఈ అద్దెలు పెరిగేందుకు ఎక్కువ సమయం పట్టదని బ్రోకర్లు అంటున్నారు.