Stock Market Today, 03 May 2024: గ్లోబల్‌ మార్కెట్లలోని పాజిటివ్‌ ట్రెండ్‌ ఆధారంగా ఈ రోజు (శుక్రవారం) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు కూడా సానుకూల ఆరంభాన్ని ఇవ్వొచ్చు. 


గురువారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,648 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,888 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌లో ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, ఈ ఉదయం.. దక్షిణ కొరియా కోస్పి 0.39 శాతం, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 0.52 శాతం పెరిగాయి. హాంగ్‌కాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్‌ సూచీ 1.56 శాతం పైకి చేరింది. ఆస్ట్రేలియాలోని S&P/ASX 200 ఇండెక్స్ 0.42 శాతం పెరిగింది. జపాన్ & చైనా మార్కెట్లకు ఈ రోజు సెలవు.


US ఎంప్లాయ్‌మెంట్‌ డేటా అంచనాలతో, గురువారం, అమెరికన్‌ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.85 శాతం ర్యాలీ చేసింది. S&P 500 0.91 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 1.51 శాతం లాభపడ్డాయి.


యూఎస్‌ మానిటరీ పాలసీని ఇన్వెస్టర్లు జీర్ణించుకోవడంతో అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ తగ్గింది, 4.59 శాతం వద్ద ఉంది. అమెరికాలో ఆర్థిక ఆందోళనల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ స్వల్పంగా పెరిగింది, $84 వద్దకు చేరింది. యూఎస్‌లో వడ్డీ రేట్ల నుంచి మరిన్ని హింట్స్‌ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఔన్సుకు $2,310 దగ్గరకు చేరింది.
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: టైటన్, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, MRF, మంగళూరు రిఫైనరీ, కార్బోరండమ్ యూనివర్సల్, ఐనాక్స్ విండ్, ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, రేమండ్, గో ఫ్యాషన్ ఇండియా, ఆర్తి డ్రగ్స్, తత్వ చింతన్ ఫార్మా కెమికల్, HFCL.


కోఫోర్జ్: Q4 FY24లో, కోఫోర్జ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 94.8 శాతం పెరిగి రూ.223.7 కోట్లకు చేరుకుంది. ఆదాయం 8.7 శాతం పెరిగి రూ. 2,358.5 కోట్లుగా నమోదైంది. ఒక్కో షేర్‌కు రూ.1,415 చొప్పున చెల్లించి, సిగ్నిటీ టెక్నాలజీస్‌లో 54 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


డాబర్: 2024 మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 16.5 శాతం పెరిగి రూ. 341 కోట్లకు చేరుకోగా, ఆదాయం 5 శాతం పెరిగి రూ.2,814.6 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో ఆర్గానిక్‌ డొమెస్టిక్‌ వాల్యూ 4.2 శాతం పెరిగింది.


సియట్‌: 2024 జనవరి-మార్చి కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 22.76 శాతం (YoY) పడిపోయి రూ. 102.27 కోట్లకు పరిమితమైంది. ఆదాయం మాత్రం 4 శాతం పెరిగి రూ. 2,991.85 కోట్లకు చేరింది.


కోల్ ఇండియా: Q4లో నికర లాభం రూ. 8,682 కోట్లకు చేరింది, ఇది YoYలో 26 శాతం వృద్ధి. ఆదాయం మాత్రం 2 శాతం తగ్గి రూ.37,410 కోట్లకు దిగి వచ్చింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: నికర లాభం Q4 FY24లో 38 శాతం తగ్గి రూ.451 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 1 శాతం పెరిగి రూ.29,180 కోట్లుగా లెక్క తేలింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ కేస్‌ దర్యాప్తులో భాగంగా, సెబీ నుంచి రెండు షోకాజ్ నోటీసులు అందాయని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది.


నిన్న Q4 ఫలితాలు ప్రకటించిన కొన్ని కంపెనీలు: ఆర్‌ సిస్టమ్స్ ఇంటర్నేషనల్, లిండ్స్‌ ఇంజినీరింగ్ వర్క్స్, ప్రోక్టర్ అండ్ గాంబుల్ హెల్త్, లింక్ (Linc), JBM ఆటో, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్, ఉర్గో క్యాపిటల్, KEI ఇండస్ట్రీస్, రైల్‌టెల్ కార్పొరేషన్. ఈ రోజు ట్రేడింగ్‌లో వీటిపైనా ఇన్వెస్టర్ల ఫోకస్‌ ఉంటుంది.


బజాజ్ ఫైనాన్స్: ఈ కంపెనీ eCOM, ఆన్‌లైన్ డిజిటల్ Insta EMI కార్డ్ ఉత్పత్తులపై ఉన్న పరిమితులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలగించింది, ఈ ఆదేశం తక్షణం అమల్లోకి వస్తుంది.


అదానీ ఎనర్జీ: విండ్‌సన్ ప్రాజెక్ట్‌తో ఒప్పందంలో భాగంగా పాయింట్‌ల్యాప్ ప్రాజెక్ట్‌లను రూ. 13.15 కోట్లకు ఆదానీ ఎనర్జీ కొనుగోలు చేస్తుంది.


మాక్స్ ఎస్టేట్స్: గురుగావ్‌లోని రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం రూ. 9,000 కోట్లకు పైగా గ్రాస్‌ డెవలెప్‌మెంట్‌ వాల్యూతో ఈ కంపెనీ అనుబంధ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.


అజంత ఫార్మా: 1.03 మిలియన్ ఈక్విటీ షేర్ల కోసం షేర్ బైబ్యాక్ ప్లాన్‌ ప్రకటించింది. కంపెనీ మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లలో ఇది 0.82 శాతానికి సమానం.


జైడస్ లైఫ్‌సైన్సెస్: బేయర్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పూర్తిగా దక్కించుకునేందుకు, బేయర్ జైడస్ ఫార్మాలో మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ 282 కోట్లు.


ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX): 2024 ఏప్రిల్‌లో 9,044 మిలియన్ యూనిట్లను (MU) సాధించింది. YoYలో ఇది 14.1 శాతం వృద్ధి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ చుక్కలు చూపిస్తున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి