Stocks to watch today, 05 December 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 41 పాయింట్లు లేదా 0.22 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,865 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


మారుతి సుజుకి ఇండియా: దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ, జనవరి 2023 నుంచి తన వాహనాల ధరలను 'గణనీయంగా' పెంచనుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలను భర్తీ చేసుకోవడానికి, ఏప్రిల్ 2023 నుంచి కఠినంగా మారనున్న ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మోడళ్ల రేంజ్‌ను నవీకరించడానికి రేట్ల పెంపునకు నిర్ణయించింది.


NTPC: ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ విద్యుత్ దిగ్గజ సంస్థకు అనుబంధ కంపెనీ అయిన NTPC గ్రీన్ ఎనర్జీకి మార్చి 2023 నాటికి వ్యూహాత్మక పెట్టుబడిదారుడి దొరికే అవకాశం ఉంది. దేశంలో పునరుత్పాదక ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి వ్యూహాత్మక పెట్టుబడి ద్వారా రూ. 3,000 కోట్ల వరకు సమీకరించడానికి వీలవుతుంది.


పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ పవర్ ట్రాన్స్‌మిషన్ మేజర్, వాల్యూ చైన్‌ను పెంచడానికి 'పవర్‌గ్రిడ్ టెలీ సర్వీసెస్' పేరిట పూర్తి స్థాయి అనుబంధ టెలికాం కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది.


ఫార్మా స్టాక్స్: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా US మార్కెట్‌లోని వివిధ ఉత్పత్తులను తయారీ సమస్యల కారణంగా రీకాల్ చేస్తున్నాయి. జలుబు సంబంధిత మందుకు సంబంధించి 48,000 కార్టన్లను డాక్టర్‌ రెడ్డీస్‌ వెనక్కు తీసుకుంటోంది. ఎరోసివ్ ఎసోఫాగిటిస్ చికిత్స కోసం ఉపయోగించే ఔషధానికి సంబంధించి 14,064 కార్టన్లను సన్ ఫార్మా రీకాల్ చేస్తోంది.


గోద్రెజ్ ప్రాపర్టీస్: లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి ముంబైలోని కండివాలి వద్ద 18.6 ఎకరాల భూమిని సుమారు రూ. 750 కోట్లకు ఈ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసింది. 


PB ఫిన్‌టెక్ (పాలసీబజార్‌): NSE బ్లాక్ డీల్ డేటా ప్రకారం... పాలసీబజార్‌కు చెందిన 2.28 కోట్ల షేర్లను లేదా 5.1 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా సాఫ్ట్‌బ్యాంక్ విక్రయించింది. ఈ డీల్‌ విలువ రూ. 1,042.52 కోట్లు. సగటు ధర రూ. 456.4 చొప్పున విక్రయించింది. గోల్డ్‌మన్ సాక్స్, సొసైటీ జెనరలే, మోర్గాన్ స్టాన్లీ, మాక్స్ లైఫ్ కొనుగోలుదార్లలో ఉన్నాయి.


NMDC: ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న ఈ మెటల్ మైనింగ్‌ కంపెనీ, గత ఏడాది నవంబర్‌ నెలతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌ నెలలో ఇనుప ఖనిజం ఉత్పత్తిలో 3.61 మిలియన్ టన్నులతో ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది నవంబర్‌లో అమ్మకాలు కూడా 5.5 శాతం పెరిగి 3.04 మిలియన్ టన్నులకు చేరాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2022 కాలంలో ఇనుప ఖనిజం ఉత్పత్తి కంపెనీ చరిత్రలో రికార్డ్‌ స్థాయిలో ఉంది.


కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్‌): అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్, బల్క్ డీల్ ద్వారా ఈ హాస్పిటల్‌కు 14.5 లక్షల షేర్లు లేదా 1.8 శాతం వాటాను అమ్మేసింది. ఒక్కో షేరును సగటు ధర రూ. 1,480 చొప్పున రూ. 214.6 కోట్లకు ఆఫ్‌లోడ్ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.