Stock Market update Telugu: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా ముగిశాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ వారంలో మాత్రమే సూచీలు వరుసగా లాభపడ్డాయి. ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తున్నా డొమస్టిక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు మాత్రం కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. యుద్ధం భయంతో ముడిచమురు ధరలు పెరిగే అవకాశాలున్నా మదుపర్లలో కాస్త ఆందోళన తగ్గినట్టే ఉంది. మొత్తంగా మార్కెట్లకు సపోర్టు దొరికిందనే భావిస్తున్నారు.


BSE Sensex


క్రితం సెషన్లో 55,464 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,218 వద్ద మొదలైంది. సూచీ ఈ రోజంతా రేంజ్‌ బౌండ్‌లోనే కదలాడింది. 55,049 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 55,833 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 85 పాయింట్ల లాభంతో 55,550 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 16,549 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,528 వద్ద శుక్రవారం మొదలైంది. ప్రైస్‌ యాక్షన్‌ అంతా 16,550 నుంచి 16,650 మధ్య కనిపించింది. 16,470 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 16,694 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 35 పాయింట్ల స్వల్ప లాభంతో 16,630 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌దీ అదే పరిస్థితి. ఉదయం 34,331 వద్ద ఆరంభమైన సూచీ 34,094 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,880 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 70 పాయింట్ల లాభంతో 34,546 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీలో 28 కంపెనీల షేర్లు లాభపడగా 22 నష్టాల్లో ముగిశాయి. సిప్లా, బీపీసీఎల్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐఓసీ షేర్లు లాభాల్లో ముగియగా నెస్లే ఇండియా, మారుతీ, టాటా కన్జూమర్‌, హిందాల్కో, ఎన్టీపీసీ నష్టపోయాయి. ఫార్మా సూచీ 2 శాతం మెరుగవ్వగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మిగతా సూచీలు ఒక శాతం వరకు పెరిగాయి.