Stock Market Update: భారత స్టాక్‌ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల మధ్య కొనసాగాయి. లాభాల్లోనే ఆరంభమైనా క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత పుంజుకున్నా ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఒక్కసారిగా పతనమయ్యాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 145 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,300 పై స్థాయిల్లో ముగిసింది.


Bse Sensex


క్రితం సెషన్లో 58,142 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,310 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. మరికాసేపటికే 57,780 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. ఆపై పుంజుకొని 58,569 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఒక్కసారిగా అమ్మకాల వెల్లువ కొనసాగింది. దాంతో 145 పాయింట్ల నష్టంతో 57,996 వద్ద ముగిసింది.


Nse Nifty


మంగళవారం 17,352 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,408 వద్ద ఆరంభమైంది. 17,257 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకున్న సూచీ లాభాల్లోనే కదలాడింది. 17,490 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పతనమైంది. చివరికి 30 పాయింట్ల నష్టంతో 17,322 వద్ద ముగిసింది.


Bank Nifty


బ్యాంక్‌ నిఫ్టీ ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య కదలాడింది. 38,296 వద్ద మొదలైన సూచీ 38,461 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అమ్మకాలు కొనసాగడంతో 37,762 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. చివరికి 216 పాయింట్ల నష్టంతో 37,953 వద్ద ముగిసింది.


Gainers and Losers


నిఫ్టీలో 17 కంపెనీలు లాభాల్లో, 33 నష్టాల్లో ముగిశాయి. దివీస్‌ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, ఐఓసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, పవర్‌, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల సూచీల్లో అమ్మకాలు కొనసాగాయి. హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియాలిటీ సూచీలు లాభపడ్డాయి.