Stock Market Today: షుగర్‌ స్టాక్స్‌ ఇవాళ (బుధవారం, 06 సెప్టెంబర్‌ 2023) రైజింగ్‌లో ఉన్నాయి, ఇన్వెస్టర్లకు తియ్యటి రిటర్న్స్‌ ఇచ్చాయి. చెరకు పంటను సాగు చేస్తున్న ప్రాంతాల్లో రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి, ఉత్పత్తి తగ్గుతుందన్న ఆందోళనలు మార్కెట్‌లో కనిపించాయి. దీంతో, షుగర్‌ కౌంటర్లు 8% వరకు లాభపడ్డాయి.


ఇవాళ ఓపెనింగ్‌ ట్రేడింగ్‌లో 5% పెరిగిన రాణా షుగర్ (Rana Sugar), ఈ ప్యాక్‌లో టాప్ గెయినర్‌గా ఉంది. ఆ తర్వాత శ్రీ రేణుకా షుగర్స్ (Shree Renuka Sugars), ది ఉగర్ షుగర్ (The Ugar Sugar), ద్వారికేష్ షుగర్ (Dwarikesh Sugar), ఈద్ పారీ (Eid Parry), త్రివేణి ఇంజినీరింగ్ & ఇండస్ట్రీస్ ‍‌(riveni Engineering & Industries), బలరాంపూర్ చీని మిల్స్ ‍‌(Balrampur Chini Mills) 8% నుంచి 1.4% మధ్య లాభపడ్డాయి.


గత 15 రోజుల్లో చక్కెర ధర 3% పైగా జంప్ చేసి ఆరేళ్లలో గరిష్ట స్థాయికి చేరడంతో, షుగర్‌ కంపెనీల షేర్లు కూడా ర్యాలీ చేస్తున్నాయి. 


రాబోయే సీజన్‌లో చక్కెర కొరత!
రాయిటర్స్ రిపోర్ట్‌ ప్రకారం, దేశంలోని కీలకమైన చెరకు సాగు ప్రాంతాల్లో సరైన వర్షాలు పడడం లేదు. దీనివల్ల రాబోయే సీజన్‌లో ఉత్పత్తి తగ్గుతుందని, చక్కెర కొరత వల్ల రేట్లు పెరుగుతాయని, ఫలితంగా చక్కెర కంపెనీల ఆదాయాలు, లాభాలు కూడా పెరుగుతాయని మార్కెట్‌ భావిస్తోంది. చక్కెర కంపెనీలకు పెరిగే ఆదాయాలను మార్కెట్‌ ఇప్పట్నుంచే అబ్జార్బ్‌ చేసుకుంటోంది.


పంచదార ధరలు పెరిగితే బలరాంపూర్ చీని మిల్స్‌, ద్వారికేష్ షుగర్, శ్రీ రేణుకా షుగర్స్, దాల్మియా భారత్ షుగర్ వంటి కంపెనీల మార్జిన్లు మెరుగుపడతాయి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయగలుగుతాయి. ఫలితంగా ఆయా కంపెనీల బకాయి, అకౌంట్‌ బుక్స్‌ మీద భారం తగ్గుతుంది. ఆర్థిక ఫలితాలు మెరుగుపడతాయి. షుగర్‌ షేర్లలో ఉత్సాహానికి ఇది కూడా ఒక కారణం.


అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 3.3% తగ్గి 31.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోయే అవకాశం ఉంది. పశ్చిమ రాష్ట్రమైన మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో చెరకు దిగుబడిని తక్కువ వర్షపాతం బాగా దెబ్బ కొట్టింది. మొత్తం భారతదేశ ఉత్పత్తిలో ఈ రెండు రాష్ట్రాలకే సగానికి పైగా వాటా ఉంది.


చక్కెర ధరలు మంగళవారం రోజున టన్నుకు 37,760 రూపాయలకు ($454.80) చేరాయి, 2017 అక్టోబర్‌ తర్వాత ఇదే అత్యధికం. అయినా, ఇండియన్‌ రేట్లు, ప్రపంచ వైట్‌ షుగర్‌ బెంచ్‌మార్క్ కంటే దాదాపు 38% తక్కువలో ఉన్నాయి.


గవర్నమెంట్‌ నుంచి పొంచి ఉన్న రిస్క్‌
అయితే, చక్కెర పరిశ్రమ మీద కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో దేశీయంగా సప్లై తగ్గితే, చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించే అవకాశం ఉంది. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 11.1 మిలియన్ మెట్రిక్ టన్నులను అమ్మడానికి అనుమతించిన సెంట్రల్‌ గవర్నమెంట్‌, ప్రస్తుత సీజన్‌లో సెప్టెంబర్ 30 వరకు 6.1 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెరను మాత్రమే ఎగుమతి చేయడానికి మిల్లులను అనుమతించింది. ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే షుగర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ తగ్గుతాయి, కంపెనీల ఆదాయాలూ తగ్గుతాయి. ఫైనల్‌గా షుగర్‌ షేర్‌ ధరలు పడిపోయే ప్రమాదం ఉంటుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: