Stock Market News Today in Telugu: ప్రపంచ మార్కెట్ల ఒత్తిళ్ల మధ్య, ఈ రోజు (బుధవారం, 27 మార్చి 2024) భారత స్టాక్ మార్కెట్లు జాగ్రత్తపూరిత వైఖరితో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్ప లాభాలతో బండిని స్టార్ట్‌ చేసినా, ఆ తర్వాతి నుంచి టాప్‌ గేర్‌లో దూసుకువెళ్తున్నాయి. రిలయన్స్‌ ఈ రోజు ఫుల్‌ జోష్‌లో ఉంది, బెంచ్‌మార్క్‌లను పైపైకి లాక్కెళుతోంది. మారుతి కార్లు కూడా RILకు జత కలిశాయి. అయితే, ఈ స్పీడ్‌కు ఐటీ షేర్లు స్పీడ్‌ బ్రేకర్లు మారాయి. 


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 72,470 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 222 పాయింట్లు పెరిగి 72,692.16 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 22,005 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 49 పాయింట్లు పెరిగి 22,053.95 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


మార్కెట్ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత, ఉదయం 9.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ దాదాపు 160 పాయింట్ల లాభంతో 72,630 పాయింట్ల ఎగువన ఉంది. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 22,058 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.5 శాతం, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.7 శాతం పెరిగాయి.


ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 21 స్టాక్స్‌ లాభపడగా, మిగిలిన 9 స్టాక్స్‌ క్షీణించాయి. ఇందులో, చాలా పెద్ద కంపెనీల షేర్లు గ్రీన్ జోన్‌లో కనిపించాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 2 శాతానికి పైగా పెరిగింది. మారుతి సుజుకి షేర్లు 1.27 శాతం జంప్‌ చేశాయి.  బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో కూడా లాభాల్లో ఉన్నాయి. మరోవైపు.. విప్రో అత్యధికంగా 0.53 శాతం నష్టాల్లో ఉంది. నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్వల్పంగా తగ్గాయి. UPL, JSW స్టీల్, టాటా కన్స్యూమర్ కూడా నష్టాల బాటలో నడిచాయి.


రిలయన్స్‌ షేర్ల టార్గెట్ ధరను గోల్డ్‌మన్ సాచ్స్ పెంచడంతో, RIL దాదాపు 3% జంప్ చేసింది


భారతదేశంలో సనోఫీ సెంట్రల్ నెర్వస్‌ సిస్టమ్‌ (CNS) ఔషధాలను మరింత విస్తృతంగా మార్కెటింగ్‌ చేయడానికి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. సనోఫీ ఇండియా 4 శాతం లాభపడింది, సిప్లా 1 శాతం పెరిగింది.


బ్లాక్ డీల్స్ ద్వారా దాదాపు 10% ఈక్విటీ షేర్లు చేతులు మారడంతో.. ఆస్టర్‌ DM, CDSL షేర్లు 7% వరకు తగ్గాయి.


ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 486.32 పాయింట్లు లేదా 0.67% పెరిగి 72,956.62 దగ్గర; NSE నిఫ్టీ 142.15 పాయింట్లు లేదా 0.65% పెరిగి 22,146.85 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ రోజు ఉదయం, ఆసియా మార్కెట్లు దాదాపుగా పాజిటివ్‌ సైడ్‌లో మూవ్‌ అవుతున్నాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ 0.65 శాతం పెరిగి 40,662 స్థాయి కంటే పైన ట్రేడవుతోంది. Topix కూడా 0.67 శాతం పెరిగింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి రేంజ్ బౌండ్‌లో ఉంది. ఆస్ట్రేలియా ASX 200 కూడా 0.37 శాతం పెరిగింది. అయితే, హాంగ్ కాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.32 శాతం క్షీణించి 16,398 స్థాయిలకు చేరుకుంది.


నిన్న, అమెరికాలో, మూడు ప్రధాన ఇండెక్స్‌లు వరుసగా మూడో రోజూ నష్టాల్లో కొనసాగాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్వల్పంగా పడిపోయింది. S&P 500 0.28 శాతం దిగి వచ్చింది. టెక్ హెవీ నాస్‌డాక్ కాంపోజిట్ 0.42 శాతం క్షీణించింది.


అమెరికాలో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా పెరిగి 4.236 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ భారీగా పడిపోయి, బ్యారెల్‌కు $85 వద్దకు తిరిగి వచ్చింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బిలియనీర్ల రాజధాని బీజింగ్ కాదు, ముంబై - పెరిగిన లక్ష్మీపుత్రులు