Stock Market News Today in Telugu: గ్లోబల్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు (బుధవారం) ఫ్లాట్‌గా ప్రారంభమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌, నిఫ్టీ గ్రీన్‌ కలర్‌లో ఓపెన్‌ అయ్యాయి, ఆ వెంటనే పుంజుకునే ప్రయత్నం చేశాయి. నిన్నటిలాగే ఈ రోజు కూడా FMCG షేర్లలో క్షీణత కనిపించింది. దీంతో పాటు మీడియా, మెటల్, ఫార్మా రంగాలు కూడా వెనకడుగు వేశాయి. అయితే.. నిఫ్టీ ఆటో షేర్లు 1.07 శాతం పెరిగితే, నిఫ్టీ రియాల్టీ 0.94 శాతం, నిఫ్టీ PSUs 0.83 శాతం లాభపడ్డాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 72,012 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 24.81 పాయింట్ల లాభంతో 72,036.86 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 21,817 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 26.45 పాయింట్లు లేదా 0.12 శాతం స్వల్ప పెరుగుదలతో 21,843.90 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.30 శాతం, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.17 శాతం పుంజుకున్నాయి.


ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 19 స్టాక్స్‌ లాభపడగా, మిగిలిన 11 స్టాక్స్‌ క్షీణతలో ఉన్నాయి. మారుతి సుజుకి 2.57 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.54 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.20 శాతం, పవర్ గ్రిడ్ 1.14 శాతం, భారతి ఎయిర్‌టెల్ 0.83 శాతం, నెస్లే 0.79 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి. టాటా కెమికల్స్, టొరెంట్ పవర్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.


నిఫ్టీ 50 ప్యాక్‌లో 26 షేర్లు లాభపడగా, 22 షేర్లు నష్టపోయాయి. 2 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఐషర్ మోటార్స్ 4.61 శాతం, మారుతి సుజుకి 2.53 శాతం, బీపీసీఎల్ 2.38 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.90 శాతం, బజాజ్ ఆటో 1.53 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. పతనమైన షేర్లలో.. హిందాల్కో 1.67 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1.37 శాతం, యూపీఎల్ 1.31 శాతం, గ్రాసిమ్ 1.23 శాతం, డీవీస్ ల్యాబ్స్ 1.04 శాతం బలహీనంగా కనిపించాయి.


ఈ రోజు ఉదయం 10.05 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 53.09 పాయింట్లు లేదా 0.07% తగ్గి 71,958.96 దగ్గర; NSE నిఫ్టీ 27.85 పాయింట్లు లేదా 0.13% తగ్గి 21,789.60 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం, దాదాపుగా ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లన్నీ ఆకుపచ్చ రంగులో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ASX 200 0.17 శాతం పెరిగింది. వడ్డీ రేట్లను 4.35 శాతం వద్ద కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వరుసగా మూడో సమావేశంలోనూ నిర్ణయించింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 1.37 శాతం జంప్‌ చేయడంతో దక్షిణ కొరియా కోస్పి 1.12 శాతం పెరిగింది. జపాన్‌ నికాయ్‌  0.66 శాతం బలపడింది. అయితే.. హాంగ్ కాంగ్‌లో హాంగ్ సెంగ్ సూచీ 0.51 శాతం క్షీణించగా, చైనా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తర్వాత చైనీస్ CSI 300 0.72 శాతం పడిపోయింది.


నిన్న ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమావేశం ప్రారంభం కావడంతో, U.S.లో మూడు ప్రధాన ఇండెక్స్‌లు పెరిగాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.83 శాతం పెరిగింది, ఫిబ్రవరి 22 తర్వాత బలమైన పనితీరును కనబరిచింది. S&P 500 కొత్త రికార్డును చేరుకుంది, 0.56 శాతం పెరిగి 5,178.51 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ కూడా 0.39 శాతం లాభపడింది.


US ఫెడ్ మీటింగ్‌ నేపథ్యంలో, అమెరికాలో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.29 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $87 దాటింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఖజానాకు కాసుల కళ, రూ.18.90 లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు