Stock Market News Today in Telugu: గత సెషన్‌లో మహా జోరు కనబరిచిన భారతీయ స్టాక్ మార్కెట్‌, ఈ రోజు (సోమవారం, 19 ఫిబ్రవరి 2024) ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రారంభమైంది. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో ఉండడం మన మార్కెట్‌ మీద ప్రభావం చూపింది. ఐటీ షేర్లలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ బ్యాంకు షేర్లు, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో బుల్లిష్ మార్క్ కనిపించింది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (శుక్రవారం) 72,427 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 200.96 పాయింట్లు లేదా 0.28 శాతం పెరిగి 72,627.60 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 22,041 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 62.75 పాయింట్లు లేదా 0.28 శాతం పెరుగుదలతో 22,103.45 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ తలో 0.08% వరకు పెరిగాయి.


BSE స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో.. MRPL 14% జంప్‌ చేసింది. ఓమాక్స్‌, కేఐఓసీఎల్‌, నోవార్టిస్‌ 10% వరకు పెరిగాయి. 


BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లో.. క్రిసిల్‌ 8%, పాలసీబజార్‌ 5% పైగా గెయిన్‌ అయ్యాయి. GMR ఇన్‌ఫ్రా 2% క్షీణించింది. Q4 నికర లాభంలో 33% పెరుగుదలతో క్రిసిల్‌ 8% లాభపడింది.


సెన్సెక్స్‌లో, ట్రేడ్‌ ప్రారంభ సమయంలో ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు.. విప్రో, టీసీఎస్‌ అత్యధికంగా 1 శాతంపైగా పతనమయ్యాయి. L&T, ఇండస్‌ఇండ్, యాక్సిస్ బ్యాంక్ కూడా టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి. 


నిఫ్టీ విషయానికి వస్తే.. బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్‌ లిస్ట్‌లో ఉన్నాయి.


పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించిన వివిధ అప్‌డేషన్ల నేపథ్యంలో, Paytm షేర్లు ఈ రోజు కూడా అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. మార్కెట్‌ ఓపెనింగ్ టైమ్‌లో, పేటీఎం షేర్‌ ధర రూ. 17.05 లేదా 5 శాతం జంప్‌తో రూ. 358.35 వద్ద అప్పర్ సర్క్యూట్‌లో లాక్‌ అయింది.


ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 18.09 పాయింట్లు లేదా 0.02% పెరిగి 72,444.73 దగ్గర; NSE నిఫ్టీ 17.25 పాయింట్లు లేదా 0.07% పెరిగి 22,057.95 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆదివారం, చైనాలో వడ్డీ రేట్లను ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ స్థిరంగా ఉంచింది. ఈ ఉదయం, ఆసియా మార్కెట్లు తలో దిక్కులో ముందుకు సాగుతున్నాయి. షాంఘై ఇండెక్స్ 1 శాతం, కోస్పీ 0.9 శాతం పెరిగాయి. హాంగ్ సెంగ్ 1 శాతానికి పైగా జారిపోగా, నిక్కీ 0.4 శాతం పడిపోయింది. స్ట్రెయిట్స్ టైమ్స్, తైవాన్ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.


జనవరిలో, US ప్రొడ్యూసర్స్‌ ప్రైస్‌ ఇండెక్స్‌, మార్కెట్‌ అంచనా 0.1 శాతంకు మించి 0.3 శాతం పెరగడంతో.. బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగాయి. దీంతో, శుక్రవారం ట్రేడ్‌లో US మార్కెట్లు రెడ్‌ జోన్‌లో ముగిశాయి. US 10-ఇయర్స్‌ బాండ్ ఈల్డ్ గరిష్టంగా 4.33 శాతానికి చేరుకుంది, ఆ తర్వాత 4.293 శాతం వద్ద స్థిరపడింది. 


మిడిల్‌ ఈస్ట్‌ టెన్షన్ల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ దాదాపు $83 మార్కును చేరింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి