Stock Market Holidays 2023: బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE) ప్రకటించిన స్టాక్‌ మార్కెట్ హాలిడే క్యాలెండర్ ప్రకారం, బాబా సాహెబ్‌ అంబేద్కర్ జయంతి కారణంగా ఈక్విటీ మార్కెట్లకు ఇవాళ (శుక్రవారం, 14 ఏప్రిల్ 2023‌) సెలవు. ఈక్విటీ, డెరివేటివ్, SLB సహా అన్ని విభాగాల్లో ఇవాళ ట్రేడింగ్‌ జరగదు.


మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (MCX) మాత్రం ఇవాళ ఉదయం మొదటి సెషన్‌లో క్లోజ్‌ అవుతుంది, సాయంత్రం సెషన్‌లో ఓపెన్‌ అవుతుంది. అంటే, MCXలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.


ఈ నెలలో, శని & ఆదివారాలతో పాటు వచ్చే సాధారణ సెలవులతో పాటు, అదనంగా 3 రోజులు ప్రత్యేక సెలవులు వచ్చాయి. ఈ నెల 4 మహావీరుడి జయంతి, 7వ తేదీన గుడ్ ఫ్రైడే, ఇవాళ అంబేద్కర్ జయంతి కారణంగా మార్కెట్లకు అదనపు సెలవులు వచ్చాయి. దీంతో, ఈ నెలలో ట్రేడింగ్ డేస్‌ కేవలం 17 రోజులకు పరిమితం అయ్యాయి. 2023 మొత్తం క్యాలెండర్ సంవత్సరంలో మార్కెట్‌లకు 15 ప్రత్యేక సెలవులు ఉన్నాయి, గత సంవత్సరం కంటే రెండు హాలిడేస్‌ ఎక్కువ వచ్చాయి. మే నెలలో, మహారాష్ట్ర దినోత్సవాన్ని ‍‌(Maharashtra Day) పురస్కరించుకుని మే 1వ తేదీన మార్కెట్లకు సెలవు ఉంది.


గురువారం మార్కెట్‌ ఎలా సాగింది?             
వరుసగా ఎనిమిది రోజుల పాటు సానుకూలంగా పరుగులు పెట్టిన సూచీలు గురువారం నాడు ఫ్లాట్‌గా ముగిశాయి. వరుసగా మూడు రోజుల సెలవులకు ముందు రోజున (గురువారం) పెట్టుబడిదార్లు జాగ్రత్తగా వ్యవహరించారు. ఐటీ దిగ్గజం TCS Q4 సంఖ్యలు స్ట్రీట్‌ను నిరాశపరిచడంతో IT స్టాక్స్‌పై సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. మార్కెట్‌ గంటల తర్వాత ఫలితాలు వెలువరించిన ఇన్ఫోసిస్ (Infosys) కూడా నిరాశపరిచింది.


"సాధారణంగా ఉన్న Q4 ఫలితాలు, స్ఫూర్తి నింపని TCS వ్యాఖ్యానం వల్ల IT స్టాక్స్‌ సాఫ్ట్‌గా మారాయి. ఆర్థిక స్థితిగతుల్లో ఒడిదొడుకులు కొనసాగుతాయి. ఇటీవలి రోజుల్లో బలంగా పెరిగిన ఫార్మా స్టాక్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి" - జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ VK విజయకుమార్


వడ్డీ రేట్ల పరుగుకు విరామం ప్రకటించే అవకాశం       
ద్రవ్యోల్బణంపై అమెరికా, భారత్‌ నుంచి వచ్చే వార్తలు మార్కెట్లకు సానుకూలంగా ఉన్నాయి. భారతదేశంలో మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల కనిష్ట స్థాయి 5.66%కి పడిపోయింది, USలోనూ మార్చి నెల ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గి 5%కు చేరింది. 2021 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది కాబట్టి, తదుపరి RBI పాలసీ సమావేశంలోనూ ప్రస్తుత రేట్లనే MPC కొనసాగించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లకు ఇది చాలా సానుకూల ట్రిగ్గర్‌గా పని చేస్తుంది.


ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లలో గత ఎనిమిది రోజుల ర్యాలీ ప్రధానంగా విదేశీ పెట్టుబడిదార్ల (FPIలు) కొనుగోళ్లు, బలమైన నాలుగో త్రైమాసిక ఫలితాల అంచనాలతో నడిచింది. FPIలు వరుసగా తొమ్మిది రోజుల పాటు నికర కొనుగోలుదార్లుగా ఉన్నారు, ఈ కాలంలో సుమారు రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు.