Sugar Companies Shares: గత కొంతకాలంగా అప్‌వార్డ్‌లో ఉన్న షుగర్‌ స్టాక్స్‌, మంగళవారం ఇంట్రా డే ట్రేడ్‌లోనూ (27 డిసెంబర్‌ 2022) ఝుమ్ముంటూ పెరిగాయి, దాదాపు 10 శాతం వరకు లాభపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన చక్కెర స్టాక్స్‌ ఇన్వెస్టర్ల నోటిని తీపి చేసింది.


ఉత్తమ్ షుగర్ (Uttam Sugar), త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ (Triveni Engineering and Industries), శ్రీ రేణుక షుగర్స్ (Shree Renuka Sugars) శక్తి షుగర్స్ (Sakthi Sugars) మంగళవారం ఇంట్రా డే ట్రేడింగ్‌లో లాభాలు కురిపించాయి. కేంద్ర ఆహారం & ప్రజా పంపిణీల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ఈ ర్యాలీకి కారణం. B- హెవీ మొలాసిస్, చెరకు రసం, సిరప్ నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి సరఫరా చేసే చెరకు మీద నూటికి నూరు శాతం ప్రోత్సాహకాన్ని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 


ఈ ప్రకటన తర్వాత... ధంపూర్ షుగర్ మిల్స్ (Dhampur Sugar Mills), ద్వారికేష్ షుగర్ ‍‌(Dwarikesh Sugar), సింభోలి (Simbhaoli ), రాజశ్రీ షుగర్ (Rajshree Sugar) షేర్లు కూడా 5 శాతం పైగా పెరిగాయి.


కేంద్ర ప్రకటనతో ఏంటి లాభం?
గ్లోబల్ మార్కెట్‌లో చక్కెర ధరలు దాదాపు 52 వారాల గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే దేశీయ ధరలు వాటి కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు చెరకు మీద ప్రోత్సాహాకాల రూపంలో చక్కెర సంస్థలకు లబ్ధి చేకూరుతుంది, ధరల గ్యాప్‌ తగ్గుతుంది.


ఎలారా క్యాపిటల్ (Elara Capital) ద్వారికేష్ షుగర్‌ స్టాక్‌కు రూ. 145 ప్రైస్‌ టార్గెట్‌ & బయ్‌ రేటింగ్‌ కంటిన్యూ చేస్తోంది. ఈ స్టాక్ ప్రస్తుత ధర నుంచి మరో 44 శాతం వరకు పెరుగుతుందని ఈ ప్రైస్‌ టార్గెట్‌ అర్ధం. బల్‌రామ్‌పూర్ చినీ మిల్స్‌ (Balrampur Chini Mills‌) స్టాక్‌ మీద ఒక షేరుకు రూ. 445 ప్రైస్‌ టార్గెట్‌ ఇచ్చిన బ్రోకరేజ్‌, అక్యుములేట్‌ రేటింగ్ కూడా ఇచ్చింది. అంటే, ఈ షేర్లను కూడబెట్టుకోవచ్చని అర్ధం.


వ్యవసాయ ఆధారితమైన చక్కెర పరిశ్రమ రుతుపవనాల మార్పులకు గురవుతుంది. అలాగే, నిత్యావసర ఆహార పదార్థం కాబట్టి.. మార్కెట్‌ శక్తులకు వదిలేయకుండా, ధరలు ఎక్కువగా పెరక్కుండా కేంద్ర ప్రభుత్వ జోక్యం అధిక స్థాయిలో ఉంటుంది. ఇంకా, ఈ పరిశ్రమలో కాలానుగుణంగా వర్కింగ్ క్యాపిటల్ మారుతుంటుంది. ఇలాంటి మరికొన్ని అంశాల మీద చక్కెర ఉత్పత్తి కంపెనీల పనితీరు ఆధారపడి ఉంటుంది. 


జనవరిలో దేశీయ ఉత్పత్తిని అంచనా వేసిన తర్వాత, ప్రస్తుత 2022-23 సంవత్సరానికి చక్కెర ఎగుమతి కోటాను పెంచే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎక్స్‌పోర్ట్‌ కోటాను కేంద్ర ప్రభుత్వం పెంచితే, చక్కెర కంపెనీలు మరిన్ని ఎగుమతులు చేయగలుగుతాయి. తద్వారా విదేశీ ఆదాయాన్ని మరింత ఎక్కువగా సంపాదించుకుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చిన తరుణంలో చక్కెర సంస్థలకు ఇది ఒక శుభవార్త.


ప్రస్తుతం 60 లక్షల టన్నులుగా ఉన్న ఎగుమతి కోటాను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) అధ్యక్షుడు ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా ఆశాభావం వ్యక్తం చేశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.