UPI Like Credit Platform For Farmers And MSMEs: సకాలంలో సరిపడా అప్పు పుట్టక రైతులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతుంటారు. చేతిలో డబ్బు లేక, సమయానికి తగ్గ పెట్టుబడి పెట్టలేక మానసికంగా కుంగిపోతుంటారు. ఈ ఇబ్బందులు సమసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రుణ పరిష్కారాల కోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త పథకాన్ని సిద్ధం చేస్తోంది. రైతులు, MSME (Micro, Small, and Medium Enterprises)లకు లోన్లు ఇవ్వడానికి UPI తరహా వేదికను తీసుకురావాలని RBI ఆలోచిస్తోంది.


డిజిటల్ చెల్లింపుల విషయంలో UPI పని చేసే విధంగానే ఈ ప్రతిపాదిత క్రెడిట్ డిస్‌బర్సల్‌ ప్లాట్‌ఫామ్ (Credit Disbursal Platform) పని చేస్తుంది. రైతులు & MSMEలకు లోన్‌ ప్రాసెస్‌ను సరళంగా మారుస్తుంది. 


సాంకేతికత ఎంత పెరిగినా, లోన్‌ తీసుకోవడానికి రైతులు & చిన్న వ్యాపారులు ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని, డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా వినియోగదార్ల రుణాలు ఇవ్వడం ఇప్పుడు చాలా సులభమని ఆర్‌బీఐ విశ్వసిస్తోంది. 


క్షణాల్లో రుణం పొందే అవకాశం                     
RBI చెబుతున్న ప్రకారం, ప్రతిపాదిత క్రెడిట్ ప్లాట్‌ఫామ్ రైతులు & MSMEలకు రుణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ప్రస్తుతం, రైతులు వ్యవసాయ రుణం లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card - KCC) పొందడానికి బ్యాంకులతో పాటు భూ రికార్డుల విభాగాల చుట్టూ రౌండ్స్‌ కొట్టాల్సి వస్తోంది. ఆర్‌బీఐ ప్రతిపాదిత ఫ్లాట్‌ఫామ్‌ అమల్లోకి వస్తే ఈ సమస్యలన్నీ తరతాయి & క్షణాల్లో రుణం పొందడం అనుభవంలోకి వస్తుంది.


'పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఫర్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌' (PTPFC) ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆర్‌బీఐ చెబుతోంది. ఈ వేదిక, ప్రస్తుతం, వ్యవసాయ రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్, స్మాల్ MSME లోన్స్‌ వంటి రుణ ఉత్పత్తులపై పని చేస్తోంది. రుణాలు ఇచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు & స్టార్టప్‌లను దీనితో అనుసంధానించవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ. 3,500 కోట్ల విలువైన వ్యవసాయ  & MSME రుణాలను పంపిణీ చేశారు.


PPI ద్వారా ప్రజా రవాణా చెల్లింపులు              
PPI (Prepaid Payment Instruments), అంటే ప్రి-పెయిడ్ చెల్లింపు సాధనాలకు సంబంధించి కూడా రిజర్వ్ బ్యాంక్‌ ఒక మార్పు చేసింది. ఇప్పుడు, ప్రజా రవాణా వ్యవస్థ కోసం చేసే చెల్లింపులను బ్యాంకులు & నాన్ బ్యాంకింగ్ సంస్థలు (NBFCs) జారీ చేసే PPIల ద్వారా చేయవచ్చు. ప్రజా రవాణాను ఉపయోగించే ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రజా రవాణా వ్యవస్థల్లో చెల్లింపుల కోసం PPI ప్రవేశపెట్టడానికి బ్యాంకులు & నాన్ బ్యాంకింగ్ సంస్థలు అనుమతించాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.


మరో ఆసక్తికర కథనం: అనంత్‌ అంబానీ లైఫ్‌ స్టైల్‌కు సంబంధించిన ఆశ్చర్య పరిచే విషయాలు