Wipro Q3 Results: 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో (Q3FY23) ఐటీ కంపెనీలు అంచనాలను మించి ఆర్జిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి, ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ఇన్ఫోసిస్‌ (Infosys), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ‍‌(HCL Tech), సైయెంట్‌ (Cyient) మార్కెట్‌ ఎస్టిమేషన్స్‌ను బీట్‌ చేశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ Q3 ఆదాయం అంచనాలను దాటినా, లాభం మాత్రం ఆ స్థాయిని అందుకోలేదు. 


తాజాగా, విప్రో (Wipro Ltd) కూడా, మార్కెట్‌ అంచనాలను మించి, మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. Q3లో రూ. 3,052.9 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది (2021-22) ఇదే త్రైమాసిక లాభం రూ. 2969 కోట్ల కంటే ఇప్పుడు మిగుల్చుకుంది 2.82 శాతం అధికం. Q3FY23లో రూ. 2,952 కోట్ల లాభాన్ని విప్రో ఆర్జిస్తుందని మార్కెట్‌ అంచనా వేసింది.


విప్రో ఆదాయం కూడా అంచనాల కంటే ఎక్కువే వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికంలో నమోదు చేసిన రూ. 20,313.6 కోట్ల నుంచి ఇప్పుడు 14.35 శాతం వృద్ధితో రూ. 23,229 కోట్ల ఆదాయాన్ని కంపెనీ సాధించింది. Q3FY23లో రూ. 23,436 కోట్ల ఆదాయాన్ని విప్రో ఆర్జిస్తుందని మార్కెట్‌ అంచనా వేసింది.


డీల్‌ విన్స్‌లో వృద్ధి
2022 డిసెంబర్‌ త్రైమాసికంలో 4.3 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రాజెక్టులను విప్రో గెలుచుకుంది. ఏడాది క్రితం (YoY) ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 26 శాతం YoY వృద్ధి. 100 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ విలువైన లార్జ్‌ కాంట్రాక్టులను విన్‌ కావడమే ఈ వృద్ధికి కారణమని Wipro CEO & MD థియెర్రీ డెలాపోర్టె చెప్పారు. లార్జ్‌ డీల్‌ బుకింగ్స్‌ YoYలో 69 శాతం పెరిగాయి.


ఐటీ సేవల విభాగంలో ఆదాయం QoQలో 0.6 శాతం, YOYలో 10.4 శాతం పెరిగింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ QoQలో 120 బేసిస్‌ పాయింట్లు పెరిగి 16.3 శాతానికి చేరింది. సిబ్బంది వేతనాలు, ప్రోత్సాహకాలు పెంచినా కూడా ఇంత మార్జిన్‌ సాధించినట్లు CEO చెప్పారు.


కంపెనీలో అట్రిషన్‌ (సిబ్బంది వలసలు) రేట్‌ తగ్గింది. 2021 ఇదే కాలంలో సిబ్బంది వలసలు 22.7 శాతంగా ఉండగా, ఇప్పుడు 21.2 శాతానికి తగ్గాయి. సెప్టెంబరు త్రైమాసికం చివరి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,59,179గా ఉండగా, డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి 435 మంది తగ్గి 2,58,744కు పరిమితమైంది.


స్థిర కరెన్సీ (CC) ప్రాతిపదికన, పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐటీ సేవల ఆదాయం 11.5-12 శాతం మధ్య పెరొగొచ్చని విప్రో గైడెన్స్‌ ఇచ్చింది.


రూ.1 మధ్యంతర డివిడెండ్‌
ఒక్కో ఈక్విటీ షేరుకు ఒక రూపాయి మధ్యంతర డివిడెండ్‌ చెల్లించడానికి కంపెనీ బోర్డు ఓకే చెప్పింది. ఇందుకు 25 జనవరి 2023ని రికార్డ్‌ డేట్‌గా వెల్లడించింది. 10 ఫిబ్రవరి 2023న ఈ డివిడెండ్‌ చెల్లిస్తుంది.


శుక్రవారం (13 జనవరి 2023), విప్రో షేర్‌ దాదాపు ఫ్లాట్‌గా, 0.25 శాతం లాభంతో రూ. 395.50 వద్ద ముగిసింది. గత ఆరు నెలల కాలంలో ఈ స్టాక్‌ 1.48 శాతం, గత ఏడాది కాలంలో 38.18 శాతం క్షీణించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.