Prashant Kishor: దేశంలో ప్రస్తుతం అందరిచూపు ఎన్నికల ఫలితాలపైనే కొనసాగుతోంది. అసలు ఎన్నికలు ఇంకా పూర్తి కాకమునుపే స్టాక్ మార్కెట్లలో విన్నర్ గురించి భారీగా  చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాని నుంచి ప్రశాంత్ కిషోర్ వరకు ఎవరి నోట్లో విన్నా ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల గురించే వినిపిస్తోంది. అందరూ బీజేపీ గెలిస్తే లేదా గెలవకపోతే పరిస్థితుల గురించి అంచనా వేస్తుండగా.. ప్రశాంత్ కిషోర్ లెక్క మరోలా ఉంది. ఆయన కామెంట్స్ ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.


370 సీట్లలో బీజేపీ గెలవకపోతే !
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన సొంత టార్గెట్ అయిన 370 సీట్లలో గెలుపును సాధించడంలో విఫలమైతే అది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారుల సెంటిమెంట్లను దెబ్బతీస్తుందని ప్రఖ్యాత పోల్ స్టాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. దీనిని కార్పొరేట్ కంపెనీల పనితీరుతో పోల్చుతూ.. ఏదైనా కంపెనీ తాను పేర్కొన్న లక్ష్యాలను అందుకోవటంలో విఫలమైతే స్టాక్ మార్కెట్లలో సదరు కంపెనీ షేర్లపై ఆ ప్రభావం ప్రతికూలంటూ ఉండే అవకాశం ఉందన్నారు. ఇదే విధంగా బీజేపీ తన టార్గెట్ 370 సీట్ల కంటే తక్కువ గెలిస్తే అది చర్చనీయాంశంగా మారి మార్కెట్ల పతనానికి దారితీయవచ్చని అన్నారు. ఎలక్షన్ ఫలితాలను మార్కెట్లు ప్రతిబింబిస్తాయని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


మోదీ గెలుస్తాడా లేదా ఓడిపోతాడా అని కాదు 
ఏదేమైనా గత కొన్ని నెలలుగా అధికార పార్టీ 370 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందా అనే చర్చలు సాగుతున్నాయని, ఎన్నికల్లో మోదీ గెలుస్తాడా లేదా ఓడిపోతాడా అనే దానిపై కాదన్నారు ప్రశాంత్ కిషోర్. అయితే మరోపక్క ఇటీవల జరిగిన అన్ని బహిరంగ సమావేశాల్లోనూ దిగ్గజ బీజేపీ నేతలు తాము ఈ సారి ఎన్నికల్లో 400+ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఈసారి తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో తమ ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ 370 సీట్లు మాత్రం గెలిచే అవకాశాలు లేవని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశారు. చాలా కాలంగా మార్కెట్లోని అనలిస్టులు, రీసెర్చ్ సంస్థల అంచనాలు సైతం బీజేపీకి 300 కంటే తక్కువ స్థానాల్లో గెలుపొందనున్నట్లు అంచనా వేస్తున్నాయి.దీంతో ముందస్తుగా విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బును మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


విపక్షాలకు బీజేపీ గెలుపును ఆపడానికి మూడు విభిన్నమైన, వాస్తవిక అవకాశాలు ఉన్నాయని.. అయితే వాటిని సోమరితనంతో పాటు తప్పుడు వ్యూహాలతో వదులుకున్నారని ఏప్రిలో ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. బీజేపీకి స్పష్టమైన ఆధిపత్యం ఉన్నప్పటికీ పార్టీ లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేవ్ లేదని పునరుద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని పోల్ పొజిషన్ సాధించకుండా ఆపడానికి ప్రతిపక్షాలు కోల్పోయిన అవకాశాలను ఎత్తి చూపారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 379 స్థానాలకు ఇప్పటివరకు పోలింగ్ పూర్తయింది.