Petrol-Diesel Rates Cut: దేశంలోని సామాన్య ప్రజలు అతి త్వరలో మంచి వరం పొందే ఛాన్స్‌ ఉంది. మరికొన్ని నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రజలను ఆకర్షించడానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న BJP ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 


కొందరు అధికార్లు చెబుతున్న ప్రకారం, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ & డీజిల్ ధరలను (petrol, diesel prices today) తగ్గించే ప్రయత్నంలో ఉంది. రేట్ల తగ్గింపుపై అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు నేషనల్‌ మీడియాలో రిపోర్ట్స్‌ వచ్చాయి.


లీటర్‌కు రూ.10 తగ్గింపు! 
ఓ వర్గం చెప్పిన ప్రకారం, రెండు ఫ్యూయల్స్‌ మీద గరిష్టంగా రూ. 4 -6 రేంజ్‌లో కటింగ్స్‌ పడే అవకాశం ఉంది. మరో వర్గం చెబుతున్న ప్రకారం లీటర్‌కు రూ. 10 వరకు తగ్గొచ్చు. 


ముడి చమురు ధరలు గత మూడు నెలలుగా బ్యారెల్‌కు 70-80 డాలర్ల రేంజ్‌లో ఉన్నాయి. కాబట్టి, ఇంధన ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వానికి ఇది అనుకూల సమయం.


ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల, ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ (HPCL) 2023లో అతి భారీ లాభాలు ఆర్జించాయి. అంతకుముందు సంవత్సరాల్లో వచ్చిన నష్టాలను పూడ్చుకునే నెపంతో, ఈ ఏడాది అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా భారత్‌లో ధరలు తగ్గించకుండా అధిక స్థాయిలోనే కొనసాగించాయి.


ప్రస్తుతం, ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలతో (OMCs) కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. రేటు తగ్గిస్తే, అందులో 50-50 చొప్పున కేంద్ర ప్రభుత్వం-OMCలు భరించాలనే ప్రతిపాదనపై చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.


ఇంధన ధరలు తగ్గితే దేశ ప్రజల మీద ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. మొదట రవాణా వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు దిగి వస్తాయి. నవంబర్‌లో మూడు నెలల గరిష్ట స్థాయి 5.55%కి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ‍‌(retail inflation in India) కూడా ఇది తగ్గిస్తుంది.


ప్రధాని టేబుల్‌ మీద పెట్రో రేట్ల ఫైల్‌
ఇంధన ధరల మీద కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్చలు పూర్తి చేశాయి. పెట్రోల్‌, డీజిల్‌ రేట్‌ కటింగ్స్‌ సంబంధించి కొన్ని ఆప్షన్లు ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపాయి. ఆ ఆప్షన్లను పరిశీలించి, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఏ మేరకు తగ్గుతాయో అప్పుడు తెలుస్తుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంధన ధరలపై ప్రతి 15 రోజులకు ఒకసారి చర్చలు జరుపుతాయి.


గత రెండు సంవత్సరాల్లో (2021 నవంబర్‌లో, 2022 మే నెలలో), కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా ఇంధనం రేట్లను తగ్గించింది. రెండు విడతల్లో కలిపి... పెట్రోల్‌ మీద ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 13 & డీజిల్‌ మీద లీటరుకు రూ. 16 చొప్పున తగ్గించింది. ఫలితంగా చమురు ధరలు దిగి వచ్చాయి.


ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు, యూఎస్‌లో నిల్వలు పెరగడంతో.. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు (శుక్రవారం, 29 డిసెంబర్‌ 2023) కూడా 3% పడిపోయాయి. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.19 డాలర్లు పెరిగి 71.96 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 2.24 డాలర్లు తగ్గి 78.39 డాలర్ల వద్ద ఉంది. 


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి