Paytm on UPI charges: 


యూపీఐ యూజర్లకు బిగ్‌ రిలీఫ్‌! యూపీఐ లావాదేవీలకు ఎలాంటి రుసుములు ఉండవని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజుకు దీనిని సంబంధం లేదని వెల్లడించింది. పర్సన్‌ 2 పర్సన్‌, పర్సన్‌ 2 మర్చంట్‌ లావాదేవీలను ఎప్పట్లాగే ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది. వ్యాలెట్లను మాత్రమే పీపీఐ ఎకోసిస్టమ్‌లోకి తీసుకొచ్చామంది. దీంతో బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులపై ఖర్చుల భారం తగ్గుతుందని వివరించింది.


ఏప్రిల్‌ 1 నుంచి యూపీఐ ద్వారా కొన్ని రకాల చెల్లింపులపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రీపెయిడ్‌ సాధానాలైన వ్యాలెట్లు లేదా కార్డుల ద్వారా యూపీఐ విధానంలో చేపట్టే మర్చంట్‌ లావాదేవీలకు 1.1 శాతం రుసుము తీసుకుంటారని ఎన్‌సీపీఐ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.  ఆన్‌లైన్‌ మర్చంట్స్‌, పెద్ద మర్చంట్స్‌, చిన్నపాటి ఆఫ్‌లైన్‌ మర్చంట్ల వద్ద చేసే రూ.2000కు పైగా విలువైన లావాదేవీలపై 1.1 శాతం ఇంటర్ ఛేంజ్‌ ఫీజు తీసుకుంటారు. ప్రీపెయిడ్‌ సాధనాలను జారీ చేసినవారు డబ్బులు డిపాజిట్‌ అయిన బ్యాంకుకు 15 బేసిస్‌ పాయింట్ల మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అవతలి పేమెంట్‌ బ్యాంకు నుంచి వీరికి వస్తే 15 బేసిస్‌ పాయింట్ల మేర ఫీజు వస్తుంది. సాధారణంగా కార్డు పేమెంట్ల అంగీకారం, ప్రాసెసింగ్‌, ఆథరైజింగ్‌ లావాదేవీల ఖర్చులు రాబట్టేందుకు ఇలా ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజు తీసుకుంటారు.


ఇంటర్‌ఛేంజ్‌ ఫీజుపై స్పష్టత లేకపోవడంతో సాధారణ యూపీఐ లావాదేవీలపై రుసుము ఉంటుందని యూజర్లు కంగారుపడ్డారు. మంగళవారం నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. వీటిపై ఎన్‌పీసీఐ, పేటీఎం పేమెంట్‌ బ్యాంకులు స్పందించాయి. 'ఎన్‌పీసీఐ ప్రెస్‌ రిలీజ్ : యూపీఐ ఉచితం. వేగంగా, సురక్షితంగా పనిచేస్తుంది. ప్రతి నెలా బ్యాంకు ఖాతాల ద్వారా కస్టమర్లు, మర్చంట్లు ఉచితంగా 800 కోట్ల లావాదేవీలు చేపడుతున్నారు' అని ఎన్‌పీసీఐ ట్వీట్‌ చేసింది.


'ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు, వ్యాలెట్‌ ఇంటరాపరబిలిటీపై ఎన్‌పీసీఐ ఉత్తర్వులకు వివరణ - యూపీఐ లావాదేవీలపై కస్టమర్లు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతా లేదా పీపీఐ/పేటీఎం వ్యాలెట్‌ ద్వారా యూపీఐ లావాదేవీలు చేసినా ఛార్జీలు ఉండవు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకండి. మొబైల్‌ పేమెంట్లు మన ఎకానమీని మరింత ముందుకు తీసుకెళ్తాయి' అని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ట్విటర్లో వెల్లడించింది.


బ్యాంకు, ప్రీపెయిడ్‌ వ్యాలెట్‌ మధ్య పర్సన్‌ టు పర్సన్‌, పర్సన్‌ టు మర్చంట్‌ లావాదేవీలపై ఈ రుసుములు వర్తించవు. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి, ఒక వ్యక్తి వేరే మర్చంట్‌తో చేసే లావాదేవీలపై ఫీజు ఉండదు. ఎన్‌పీసీఐ 1.1 శాతం ఇంటర్ ఛేంజ్‌ ఫీజు అమలు చేస్తున్నా అందరికీ ఇది ఒకేలా వర్తించదు. కొందరు తక్కువ ఫీజుకు అర్హులు అవుతారు. ఉదాహరణకు ఒక ప్రీపెయిడ్‌ సాధనం నుంచి యూపీఐ ద్వారా పెట్రోల్‌ స్టేషన్లో చెల్లిస్తే 0.5 శాతమే ఫీజు వర్తిస్తుంది.


ప్రీపెయిడ్‌ సాధనాల నుంచి యూపీఐ ద్వారా రూ.2000కు పైగా లావాదేవీ జరిపితే టెలికాంకు 0.70 శాతం, మ్యూచువల్‌ ఫండ్‌కు ఒక శాతం, యుటిలిటీస్‌కు 0.70 శాతం, విద్యకు 0.70 శాతం, సూపర్‌ మార్కెట్‌కు 0.90 శాతం, బీమాకు ఒక శాతం, వ్యవసాయానికి 0.70 శాతం కన్వీనియెన్స్‌ స్టోర్‌కు 1.10 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. ఏదేమైనా గరిష్ఠంగా రూ.15 మాత్రమే వసూలు చేస్తారని తెలుస్తోంది.