Withdraw Up To Rs 1 Lakh PF Within 6 Months Of Joining: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదార్లు అత్యవసర సమయాల్లో డబ్బు కోసం ఇక ఇబ్బంది పడక్కర్లేదు. ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ తీసుకొచ్చింది. ఇలా చెప్పేకంటే, ఇప్పటికే ఉన్న రూల్‌ను మరింత ఈజీగా మార్చింది అనడం ఇంకా సబబుగా ఉంటుంది. ఇప్పుడు, ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఒకేసారి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఉన్న రూ. 50,000 పరిమితి కంటే ఇది రెట్టింపు డబ్బు. కొన్ని రోజుల క్రితమే ఈ కొత్త రూల్‌ (ఇప్పటికే ఉన్న రూల్‌లో మార్పు) అమల్లోకి వచ్చింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.


ఆరు నెలలు పూర్తి కాకున్నా డబ్బు తీసుకోవచ్చు
ఈపీఎఫ్‌వోను మరింత సౌకర్యవంతంగా & యూజర్‌-ఫ్లెండ్లీగా మార్చే విస్తృత సంస్కరణల్లో ఈ నిర్ణయం ఒక భాగం. ఈ కీలకమైన మార్పు వల్ల లక్షలాది మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ప్రస్తుత ఉద్యోగంలో చేరి ఆరు నెలలు కూడా పూర్తి కాని కొత్త ఉద్యోగులను కూడా ఇప్పుడు పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు కూడా గతంలో లేదు. వివాహం, వైద్య చికిత్సల వంటి సందర్భాల్లో ఉద్యోగులను ఈ కొత్త రూల్‌ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటుంది, డబ్బుకు ఇబ్బంది లేకుండా చేస్తుంది.


సంఘటిత రంగంలో ఉన్న కోటి మందికి పైగా ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులో (retirement savings) కీలక భాగం EPFO. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY24) పీఎఫ్‌ ఖాతాలపై 8.25 శాతం వడ్డీ రేటును (PF interest rate 2023-24) ప్రభుత్వం అందిస్తోంది. ఈ వడ్డీ రేటు మధ్య తరగతి వేతన జీవులకు చాలా కీలకం. ఎందుకంటే, ఇది వారి జీవితకాల పొదుపును నేరుగా ప్రభావితం చేస్తుంది.


పాత కంపెనీలు కూడా EPFO పరిధిలోకి...
మరో కీలక సంస్కరణను కూడా సర్కారు తీసుకొచ్చింది. గతంలో, EPFO పార్ట్‌నర్‌షిప్‌ నుంచి మినహాయించిన కంపెనీలను ప్రభుత్వ రంగ 'రిటైర్మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌'కు మార్చడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇలా మినహాయింపు పొందిన సంస్థలు, ప్రధానంగా 1954లో EPFO ఏర్పాటుకు ముందున్న పదవీ విరమణ పథకాల్లో ఉన్నాయి. ఆ సంస్థలు ఇప్పుడు EPFO కిందకు వచ్చే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.


ప్రస్తుతం, అలాంటివి 17 కంపెనీలు ఉన్నాయి. వాటిలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు పని చేస్తున్నారు, రూ. 1,000 కోట్ల కార్పస్ ఉంది. ఆ కంపెనీలు కోరుకుంటే EPFO పరిధిలోకి మారడానికి సర్కారు అనుమతిస్తుంది. దీనివల్ల, ఆ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్‌ రూపంలో మరింత మెరుగైన & స్థిరమైన రాబడి అందుతుంది.


ప్రస్తుతం ఉన్న రూ. 15,000 ఆదాయ పరిమితిని పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిపైన ఉన్న వాళ్లు ప్రావిడెంట్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్‌ చేయడం తప్పనిసరి. రూ.15,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులకు, రిటైర్మెంట్ సేవింగ్స్‌ & పెన్షన్‌ కోసం తమ ఆదాయంలో ఎంత కేటాయించాలనుకుంటున్నారో నిర్ణయించుకునేందుకు ఇప్పుడు ఎక్కువ సౌలభ్యం లభిస్తోంది. అంతేకాదు, ఎంప్లాయీస్‌ స్టేట్ ఇన్సూరెన్స్‌కు (ESI) వర్తించే రూ. 21,000 థ్రెషోల్డ్‌ని పెంచే ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం టేబుల్‌పై ఉన్నాయి.


మరో ఆసక్తికర కథనం: మీ సిమ్‌ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచే చవకైన ప్లాన్‌ ఇది!